సహనాన్ని తేలిగ్గా తీసుకోవద్దు.. తెగించే వచ్చా

యాక్షన్.. కట్ అంటె వెళ్లిపోయేటోడ్ని కాదని.. అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాను ఏపీలో అడుగుపెట్టలేనని బెట్టింగులు కడతారా అంటూ వైసిపి నేతలపై  ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. 20 ఏళ్లు తనతో ప్రయాణం చేయగలిగితేనే జనసేనలోకి రావాలని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. 

జనసేప పార్టీ తరపున చేసిన ప్రకటన మేరకు గాంధీ జయంతి సందర్భంగా శనివారం తూర్పు గోదావరి జిల్లాలో బాలాజీపేట రోడ్డుకు శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ శ్రమదానం సరదా కొద్దీ చేయలేదనే విషయం గుర్తుంచకోవాలని కోరారు. 

‘నన్ను పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాదు. నిలబడటానికి ఎన్ని దెబ్బలు తిన్నానో మీకేం తెలుసు..?. ఒడిదొడుకులు, ఓటములు అధిగమించి నిలబడేందుకు వచ్చాను. కుల, మత, వర్గ రహిత సమాజం నిర్మించడం మన ఆకాంక్ష. కులాల పేరిట రాజకీయాలు చేస్తున్నారు. టీవీల్లో నన్ను తిడితే భయపడతానని అనుకుంటున్నారా?. గుంతలు లేని రోడ్డు ఒక్కటైనా రాష్ట్రంలో ఉందా?. మనం ఇచ్చే పన్నులు ప్రభుత్వ ఖజానాకు వెళ్తాయి. మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే’ అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

రాష్ట్ర రాజకీయాలు కేవలం రెండిళ్ల మధ్య జరిగితే కుదరదని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. అన్ని కులాలవారికి భాగస్వామ్యం ఉండాలని చెప్పారు.నాలుగు కులాలు పెద్దన్నపాత్ర పోషిస్తే తప్ప మిగిలిన కులాలకు సాధికారిత రాదని పవన్ కల్యాణ్ తెలిపారు.

తన ప్రసంగం కొనసాగిస్తున్న సమయంలో అభిమానులు పదేపదే సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఇప్పుడు అలా పిలవొద్దు.. జనసేన అధినేతగా వచ్చాను.. సీఎం అయ్యాకే సీఎం అని పిలవండి.. పవర్ లోకి వచ్చాక పవర్ స్టార్ అని పిలవాలి.. ఇప్పుడు మాత్రం జనసేనాని అని పిలవాలని పవన్ కళ్యాణ్ అభిమానులకు పిలుపునిచ్చారు.

తన కోసమే ఆలోచిస్తే తిట్టే వారిని కింద కూర్చోబెట్టి నార తీసేవాడినని..కానీ  గాంధీ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నానని.. తిడితే.. భయపెడితే భయపెట్టే వాడిని కానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ నాశనం చేస్తోందనిని,  కేవలం తన వర్గం వారి సంక్షేమం కోసం పనిచేస్తూ.. ప్రశ్నించే వారిని టార్గెట్ చేయడం చేస్తోందని ఆయన విమర్శించారు.  

ఒక కులాన్ని వర్గ శత్రువుగా చేసుకుని వైసీపీ రాష్ట్రాన్ని నాశనం చేసిందని ధ్వజమెత్తారు. అందుకే రోడ్లు లేవు, జీతాలు, పెన్షన్లురావని విమర్శించారు. బైబిల్ చేత్తో పట్టుకుని తిరిగేవాడిని కాదని, గుండెల్లో పెట్టుకునే వ్యక్తినని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.  ఒంటరి, తెలగ, బలిజ, కాపు కులాలు ముందుకొచ్చి పెద్దన్న పాత్ర పోషస్తే తప్ప మిగిలిన కులాలకు సాధికారిత వచ్చే పరిస్థితి లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. .