జమ్మూలో మోహన్ భగవత్ నాలుగు రోజుల పర్యటన

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్‌ఎస్‌) సర్‌సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ జమ్ముకశ్మీర్‌ చేరుకున్నారు. ఆయన జమ్ములో నాలుగు రోజుల పాటు బస చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జమ్ము అంబాలాలోని కేశవ్ భవన్‌కు వచ్చారు. 

ఇటీవలి కాలంలో జమ్ముకశ్మీర్‌లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఆర్టికల్ 370, 35 ఏ రద్దుపై ఆర్ఎస్ఎస్ చాలా కాలంగా ప్రయత్నాలు చేసింది. చివరకు మోదీ ప్రభుత్వం ఆర్టికల్‌ 370తోపాటు 35 ఏ ను రద్దు చేసింది. 

జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత సర్‌సంఘ్‌చాలక్ జమ్ముకు రావడం ఇదే తిలిసారి. మోహన్‌ భగవత్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. జమ్ము అంబాలాలో ఉండనున్న నాలుగు రోజుల్లో మోహన్‌ భగవత్‌.. జమ్ముకశ్మీర్ ప్రావిన్స్ ప్రముఖ్‌లతోపాటు కార్యవర్గంతో వివిధ అంశాలపై చర్చించనున్నారు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏటా వివిధ రాష్ట్రాల ఆఫీస్ బేరర్ల సమీక్షను నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే జమ్ముకశ్మీర్ సమావేశాలు జరుగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం మోహన్‌ భగవత్‌ సమీక్షలు అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతాయి. అక్టోబర్ 2 న జమ్ము యూనివర్సిటీలోని జోరావర్ సింగ్ ఆడిటోరియంలో సెమినార్‌లో ప్రసంగిస్తారు. అక్టోబర్ 3 న జమ్ముకశ్మీర్‌లో అగ్రిగేషన్ సందర్భంగా ఆన్‌లైన్లో సంఘ వాలంటీర్లకు మార్గనిర్దేశం చేస్తారు.