చైనాపై ఆగ్రహంతో నేపాలీల నిరసన ప్రదర్శనలు 

చైనా తమ భూభాగంలోకి చొచ్చకుని వచ్చి అక్రమంగా వాడుకోవడం పట్ల ఆగ్రహంతో లోక్‌తాంత్రిక్‌ యువ మంచ్‌ ఆధ్వర్యంలో నేపాల్  ప్రజలు రోడ్లపైకి వచ్చి ‘చైనా గో బ్యాక్‌’, ‘రిటర్న్‌ అవర్‌ ల్యాండ్‌’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చైనా విస్తరణ విధానాన్ని విడనాడి తమ దేశం నుంచి వెళ్లిపోవాలని డిమాండ్‌ చేస్తూ నేపాలీలు ఆందోళనకు దిగారు.

నేపాల్‌కు చెందిన హమ్లా జిల్లాలో చైనా అక్రమంగా 15 వరకు భవనాలను నిర్మించింది. వారి జిల్లాలో పాగావేసి నేపాలీలను ఇబ్బందిపెడుతున్నది. తమ అంతర్గత వ్యవహారాల్లో చైనా జోక్యం చేసుకోవడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖాట్మండులోని మహీతిఘర్ మండలాలో జరిగిన ఆందోళనలకు లోక్‌తాంత్రిక్ యువ మంచ్ (ఎల్‌వైయూ) నాయకత్వం వహించింది. 

ఈ ఆందోళనలో దాదాపు 200 మంది పాల్గొన్నారు. నేపాల్‌లోని హుమ్లాలో చైనా ఆక్రమణలను తొలగించి, దీనిపై విచారణ జరిపించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్కడికి వెళ్లకుండా స్థానిక ప్రజలను చైనా అడ్డగిస్తున్నదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇలాఉండగా, కేపీ శర్మ ఒలి నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం చైనా ఆక్రమణలను తిరస్కరించింది. నేపాల్-చైనా మధ్య సరిహద్దు వివాదం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ప్రధాన మంత్రి షేర్ బహదూర్ థాపా ఏర్పాటు చేశారు. హుమ్లాలోని నమ్ఖా మున్సిపాలిటీలోని లిమి లాప్చా నుంచి హిల్సా వరకు నేపాల్-చైనా సరిహద్దు వివాదాన్ని ఈ కమిటీ దర్యాప్తు చేయనున్నది.