కరోనా ఆన‌వాళ్ల కోసం డ‌బ్ల్యూహెచ్‌వో మ‌ళ్లీ దర్యాప్తు

క‌రోనా వైర‌స్ ఎక్క‌డ పుట్టింది ? దాని ఆన‌వాళ్లు ఏంటి ? అది ఎలా వ్యాపించింది ? ఇలాంటి అంశాల‌ను తేల్చేందుకు మ‌రోసారి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ద‌ర్యాప్తు చేప‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయి. కోవిడ్‌19 ఆన‌వాళ్ల‌ను గుర్తించేందుకు రెండోసారి డ‌బ్ల్యూహెచ్‌వో విచార‌ణ చేప‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ ఓ క‌థ‌నం రాసింది. 

చైనాలోని వుహాన్ నుంచి వైర‌స్ వ్యాపించింద‌న్న ఆరోప‌ణ‌ల‌పై గ‌తంలో ఓసారి డ‌బ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందం ద‌ర్యాప్తు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ బృందం వుహాన్‌పై ఎటువంటి అనుమానాలు లేవ‌ని స్ప‌ష్టం చేసింది. ఈసారి సుమారు 20 మంది కొత్త శాస్త్ర‌వేత్త‌ల‌తో మ‌ళ్లీ వైర‌స్ పుట్టుక‌పై స్ట‌డీ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

కొత్త ఆధారాల కోసం నిపుణులు అధ్య‌య‌నం చేపట్ట‌నున్నారు. వుహాన్ ల్యాబ్ నుంచి క‌రోనా వైర‌స్ వ్యాపించిన‌ట్లు వ‌స్తున్న ఆరోప‌ణ‌ల్ని కూడా వాళ్ల స్ట‌డీ చేస్తారు. దర్యాప్తు చేప‌ట్ట‌బోయే కొత్త బృందంలో.. ల్యాబ‌రేట‌రీ సేఫ్టీ స్పెష‌లిస్టులు, బ‌యోసెక్యూర్టీ నిపుణులు ఉండ‌నున్నారు. 

జెన్యు స్ట‌డీలో నిష్ణాతులైన‌వారిని కూడా ఎంపిక చేశారు. సార్స్ సీవోవీ2 వైర‌స్ ఆన‌వాళ్ల గురించి వాళ్లంతా అధ్య‌య‌నం చేస్తారు. భ‌విష్య‌త్తులో రాబోయే వైర‌స్ ఉత్పాతాల గురించి కూడా ఆ బృందం అధ్య‌య‌నం చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. వైర‌స్‌కు, మాన‌వుల‌కు ఉన్న లింకు గురించి కూడా నిపుణులు విశ్లేషించ‌నున్నారు.