రానున్న రోజుల్లో కేరళ మొత్తం తాలిబనైజేషన్ అవుతుందనిబీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కేజే ఆల్ఫోన్స్ హెచ్చరించారు. 5-10 ఏండ్లలో కేరళ మరో ఆఫ్ఘనిస్తాన్లా మారడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. కేరళలో తీవ్రవాదం పెరిగిపోనున్నదని హెచ్చరించారు.
కేరళలోని యూడీఎఫ్, ఎల్డీఎఫ్లు రెండూ కలిసి తీవ్రవాదం పెరిగిపోయేలా చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. రాబోయే ఐదు నుంచి పది సంవత్సరాల్లో కేరళ రాష్ట్రం మరో ఆఫ్ఘనిస్తాన్లా మారుతుందని జోస్యం చెప్పారు. కేరళలో తాలిబనైజేషన్ జరుగుతున్నదని, ముఖ్యంగా గత 25 ఏండ్లలో కేరళలోని కొన్ని సంస్థలు తీవ్రవాదులకు అండగా నిలిచాయని ఆయన తెలిపారు.
జిహాదీ కార్యకలాపాలను అరికట్టేందుకు కేంద్రం జోక్యం కోరుతూ కేరళ బీజేపీ ప్రధాన కార్యదర్శి జార్జ్ కురియన్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాసిన నేపథ్యంలో అల్ఫోన్స్ ఈ హెచ్చరిక చేశారు. వివిధ రకాల జిహాద్లకు సంబంధించి పాల రోమన్ కాథలిక్ బిషప్ మార్ జోసెఫ్ కల్లారాంగార్ట్ చేసిన ఆరోపణలను అమిత్ షా దృష్టికి తీసుకొచ్చేందుకు జార్జ్ కురియన్ లేఖ రాశారు.
ఇలా ఉండగా, కేరళలో అధికారంలో ఉన్న సిపిఎం వృత్తిపరమైన కళాశాలల్లోని యువతను ఉగ్రవాదానికి గురిచేసేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నం జరుగుతున్నట్లు చేసిన హెచ్చరికకు సంబంధించి తదుపరి చర్యల కోసం కేంద్రానికి తన వివరాలను అందజేయాలని బిజెపి వామపక్ష ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రంలో రాబోయే పార్టీ సమావేశాలకు సంబంధించి సిపిఎం తయారు చేసిన ఒక అంతర్గత నోట్లో ఈ వ్యాఖ్యలు చేసింది.
నోట్లో పేర్కొన్న విధంగా యువతని మతతత్వం, ఉగ్రవాదం వైపు ఆకర్షించడానికి ఒక విభాగం ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నానికి అవసరమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తే, ఎన్ఐఏ వంటి కేంద్ర ఏజెన్సీలు ఈ విషయాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తాయని కేంద్ర మంత్రి వి మురళీధరన్ హామీ ఇచ్చారు.
More Stories
స్వాతి మలివాల్పై దాడి గురించి కేజ్రీవాల్ దాటవేత
2029 వరకు ప్రధానిగా నరేంద్ర మోదీ
సీఏఏ కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లు