తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు

రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ సుప్రీం కోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా రానున్నారు. ప్రస్తుతం ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న అనూప్‌ కుమార్‌ గోస్వామి చత్తీస్‌ గఢ్‌కు బదిలీపై వెళ్లనున్నారు. ఇప్పటివరకు చత్తీస్‌గఢ్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న మిశ్రా ఆంధ్ర ప్రదేశ్‌ సిజెగా రానున్నారు.

తెలంగాణ హైకోర్టు కొత్త చీఫ్‌ జస్టిస్‌గా ప్రస్తుతం కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సతీష్‌ చంద్ర శర్మ రానున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ఎన్‌వి రమణ, న్యాయమూర్తులు జస్టిస్‌ యుయు లలిత్‌, జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎఎం ఖాన్విల్కర్‌, జస్టిస్‌ లావు నాగేశ్వరరావులతో కూడిన సుప్రీం కోర్టు కొలీజియం తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమించింది. 

దానితో పాటు మొత్తం ఎనిమిది మంది న్యాయమూర్తులకు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించడం, ఐదుగురు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తులు, 25 మంది న్యాయమూర్తులను బదిలీ చేస్తూ కేంద్రానికి సిఫార్సు చేసింది. మరో ముగ్గురు న్యాయమూర్తులపై నిర్ణయం తీసుకోనున్నారు.

పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అహ్సనుద్దీన్‌ అమానుల్లా ఎపి హైకోర్టుకు బదిలీ కానున్నారు.కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు హర్యానా, పంజాబ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ కానున్నారు.

జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా

జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ఆగస్టు 29, 1964న చత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌లో జన్మించారు. బిలాస్‌పూర్‌లోని గురు ఘాసిదాస్‌ యూనివర్శిటీ బిఎస్సీ, ఎల్‌ఎల్‌బి పట్టాలు పొందారు. 1987 సెప్టెంబరు 4న న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకొని రారుగఢ్‌లోని జిల్లా కోర్టు, జబల్‌పూర్‌లోని మధ్యప్రదేశ్‌ హైకోర్టు , బిలాస్‌పూర్‌లోని ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టుల్లో ప్రాక్టీసు చేశారు. 

సివిల్‌, క్రిమినల్‌ కేసుల్లో పేరుగాంచారు. చత్తీస్‌గఢ్‌ బార్‌ కౌన్సిల్‌కు ఛైర్మన్‌గా పనిచేశారు. 2004 జూన్‌ 26 నుంచి 2007 ఆగస్టు 31 వరకూ రాష్ట్ర అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా పనిచేశారు. అనంతరం 2007 సెప్టెంబరు 1 వరకూ అడ్వకేట్‌ జనరల్‌గా కొనసాగారు. 2009 డిసెంబరు 10న చత్తీస్‌గఢ్‌ న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

 జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ

1961 నవంబరు 30న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జన్మించారు. జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ తండ్రి బిఎన్‌ శర్మ వ్యవసాయవేత్తగా ప్రసిద్ధి చెందడంతోపాటు జబల్పూర్‌ యూనివర్శిటీ ఉపకులపతిగా పనిచేశారు. తల్లి శాంతి శర్మ జబల్పూర్‌ విద్యాశాఖాధికారిగా పనిచేశారు. జస్టిస్‌ సతీష్‌ చంద్ర ప్రాథమిక విద్యాభ్యాసం క్క్రెస్ట్‌చర్చ్‌ బార్సు హయ్యర్‌సెకండరీ స్కూల్‌లోనూ జబల్‌పూర్‌ సెంట్రల్‌ స్కూల్‌లో 12 వరకూ చదివారు.

1981లో హరి సింగ్‌ గౌర్‌ యూనివర్శిటీ నుంచి బిఎస్సీ పట్టా అందుకున్నారు. అదే యూనివర్శిటీలో న్యాయ పట్టా అందుకొని 1984 సెప్టెంబర్‌ 1న మధ్యప్రదేశ్‌ బార్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. రాజ్యాంగం, సేవలు, సివిల్‌, క్రిమినల్‌ విషయాలలో ప్రాక్టీస్‌ చేశారు. 1993 మే 28లో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. 2004 జూన్‌ 28న భారత ప్రభుత్వం సీనియర్‌ ప్యానెల్‌ కౌన్సెల్‌గా నియమితులయ్యారు.

2003లో మధ్యప్రదేశ్‌ హైకోర్టు ద్వారా సీనియర్‌ న్యాయవాదిగా గౌరవం పొందారు. 2008 జనవరి 18న మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 జనవరి 15 న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్‌ శర్మ పలు విశ్వవిద్యాలయాలకు సేవలందించారు. నేషనల్‌ లా ఇన్‌స్టిట్యూట్‌ యూనివర్శిటీ భోపాల్‌ సలహా బోర్డులో సేవలందించారు.

న్యాయశాస్త్రంలో వివిధ అంశాలపై పరిశోధన వ్యాసాలు, పత్రాలు రాశారు. 2021 జనవరి 4న కర్ణాటక హైకోర్టు హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021 ఆగస్టు 31న కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు స్వీకరించారు.