పెరిగిపోతున్న తీవ్రవాదం ప్రపంచ శాంతి అతిపెద్ద విఘాతంగా మారుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో వర్చువల్ రీతిలో పాల్గొన్న ఆయన సభ్య దేశాలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించిన తాలిబన్ల అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. తీవ్రవాదుల ఆగడాల వల్ల ప్రపంచ శాంతి దెబ్బతింటోందని హెచ్చరించారు.
ప్రాంతీయ స్థిరత్వంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. గ్రూపులోని సభ్యులంతా కనెక్టివిటీ, నమ్మకం లాంటి అంశాలపై పరస్పరం పనిచేయాలని సూచించారు. ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు అని, అక్కడ రాడికలైజేషన్, తీవ్రవాదం పెరగకుండా చూడాల్సిన బాధ్యతను ఎస్సీవో సభ్యులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు.
ఎస్సీఓ 20వ వార్షికోత్సవాలను జరుపుకుంటోందని, ఈ సంస్థ భవిష్యత్తు గురించి ఆలోచించడానికి ఇదే సరైన సమయమని తెలిపారు. మధ్య ఆసియాతో అనుసంధానాన్ని పెంచుకోవడానికి భారత దేశం కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టం చేశారు. భారత దేశ విస్తృత స్థాయి మార్కెట్తో అనుసంధానం అవడం వల్ల మధ్య ఆసియా దేశాలకు గొప్ప ప్రయోజనం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రతిభావంతులైన యువతను సైన్స్, హేతుబద్ధ ఆలోచనల దిశగా ప్రోత్సహించాలని మోదీ పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం రంగంలో భారత దేశాన్ని భాగస్వామిగా చేసే దిశగా సృజనాత్మక స్ఫూర్తిని ప్రేరేపించే విధంగా స్టార్టప్స్, ఎంటర్ప్రెన్యూవర్లను ఒక తాటిపైకి తీసుకొచ్చామని చెప్పారు.
మధ్య ఆసియా చరిత్రను పరిశీలిస్తే, అక్కడ ప్రగతిశీల సంస్కృతులు, విలువలు సమ్మిళితం అయ్యాయని ప్రధాని పేర్కొన్నారు. కొన్ని శతాబ్ధాల పాటు సూఫిజం ఇక్కడ వర్ధిల్లిందని గుర్తు చేశారు. ఆసియా ప్రాంతమంతా అది వ్యాపించిందని, ఇక్కడ ప్రాంతీయ సంస్కృతుల్లో ఆ పద్ధతులను చూడవచ్చు అని ప్రధాని మోదీ తెలిపారు.
మధ్య ఆసియాలో ఉన్న చారిత్రక వారసత్వాన్ని పరిశీలిస్తే, ఎస్సీవో సభ్యదేశాలు తీవ్రవాదంపై కలిసి పోరోడాల్సి వస్తోందని ప్రధాని చెప్పారు. భారత్ తో పాటు అన్ని ఎస్సీవో సభ్యదేశాల్లో ఇస్లామ్తో అనుబంధం కలిగి ఉన్న ఎన్నో ఇన్స్టిట్యూషన్లు ఉన్నట్లు ఆయన తెలిపారు.
షాంఘై సహకార సంస్థ 2001లో ఏర్పాటైంది. కజకిస్తాన్, చైనా, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా, పాకిస్థాన్, ఇరాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. పొరుగు సంబంధాలను, పరస్పర విశ్వాసాన్ని పెంచుకోవాలన్న లక్ష్యంతో ఎస్సీవోను ప్రారంభించారు.
ఎస్సీఓ సదస్సు తజకిస్థాన్లోని దుషాంబేలో జరుగుతోంది. కొందరు నేతలు వర్చువల్ విధానంలోనూ, మరికొందరు నేతలు ప్రత్యక్షంగానూ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు భారత దేశ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ దుషాంబే వెళ్ళారు.
More Stories
శుక్రవారం రెండో విడత పోలింగ్ కు రంగం సిద్ధం
ఎన్నికల ప్రసంగం మధ్యలోనే స్పృహ తప్పిన గడ్కరీ
ఢిల్లీ లిక్కర్ కేసులో క్విడ్ ప్రోకో