గణేష్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
 
వెంటనే చెత్తనంతా క్లియర్ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్ సాగర్‌లో విగ్రహాల నిమజ్జనానికి ప్రభుత్వానికి చివరి సారి అవకాశం ఇస్తున్నామని సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ప్లాస్టర్‌ ఆఫ్ ప్యారిస్‌ విగ్రహాల నిమజ్జనానికి ఇదేచివరి అవకాశమని స్పష్టం చేశారు. 
 
నిమజ్జనానికి ఆధునిక క్రేన్లు వినియోగించాలని చెప్పా రు. హుస్సేన్ సాగర్‌ను ఒకప్పుడు మంచినీటి కోసం వాడే వారని,  సాగర్ ఆధునీకరణకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రతి ఏడాది నిమజ్జనం పేరిట దాన్ని కాలుష్యం చేస్తే ప్రజాధనం వృథా అయినట్టు కాదా అని సీజేఐ ప్రశ్నించారు.
 
ఇలా ఉండగా, హైదరాబాద్ లోని  నగరంలోని ఎంజే మార్కెట్ చౌరస్తా వద్ద ఉద్రిక్త . గణేష్ నిమజ్జనం యధావిధిగా కొనసాగించాలంటూ భాగ్యనగర్ ఉత్సవ సమితి రాస్తా రోకో నిర్వహించింది. ప్రభుత్వం నిమజ్జనం చేసుకోవడానికి వీలుగా ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేసింది. బజరంగదళ్, వీహెచ్‌పీ  నేతలు వాహనాల రాకపోకలను  అడ్డుకున్నారు. 
 
దీంతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు భారీగా మోహరించి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులను అరెస్ట్ చేశారు. వనస్థలిపురం పనామా చౌరస్తాలో కూడా  జాతీయ రహదారిపై ఆందోళనకారులు బైటాయించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఆందోళనకారులని పోలీసులు అరెస్ట్ చేశారు.