అభిషేక్‌ బెనర్జీకి ఈడీ మరోసారి సమన్లు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ  అభిషేక్‌ బెనర్జీకి  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 21 న ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని ఈడీ  ఆదేశించింది. మనీ లాండరింగ్‌ కేసులో అభిషేక్‌కు సమన్లు జారీ చేయడం ఇది మూడోసారి. బొగ్గు అక్రమ రవాణా కేసులో విచారణకు బెనర్జీ శుక్రవారం హాజరు కావాల్సి ఉంది. 

కానీ సమయం తక్కువగా ఉందంటూ అభిషేక్‌ బెనర్జీ హాజరు కాలేదు. దాంతో ఈ నెల 21 న హాజరుకావాలని మరోసారి సమన్లు ఇచ్చింది. అలాగే సెప్టెంబరు 1న  విచారణకు హాజరు కావాలని అభిషేక్ భార్య రుజిరాను ఈడీ సమన్లు జారీచేసింది. అయితే కోవిడ్‌ పరిస్థితులు కారణంగా చిన్నపిల్లలతో తాను  ఢిల్లీకి కాలేనని, దీనికి బదులుగా ఆమె కోల్‌కతా ఇంటిలో ఆమెను ప్రశ్నించాలని ఈడీని కోరారు.

సోమవారం (సెప్టెంబర్ 6) ఢిల్లీలోని జామ్ నగర్ హౌస్‌లో ఈడీ అధికారులు అభిషేక్ బెనర్జీని ఎనిమిది గంటలకు పైగా విచారించారు. కుటుంబ సభ్యులతో సంబంధమున్న రెండు సంస్థలు అందుకున్న లెక్కకు మించిన డబ్బు గురించి ప్రత్యేకంగా ప్రశ్నించినట్టు సమాచారం. ఈ విషయంలో పూర్తి సమాచారాన్ని అందించడంలో బెనర్జీని విఫలమైనట్టు తెలుస్తోంది.

బొగ్గు అక్రమ రవాణా ద్వారా వచ్చిన నగదు విషయంలో వినయ్ మిశ్రా కీలక పాత్ర పోషించారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న నిందితుడైన టీఎంసీ యువనేత వినయ్ మిశ్రాతో ఉన్న సంబంధాలపై బెనర్జీని సోమవారం ప్రశ్నించగా ఈ ఆరోపణలన్నింటిని  తోసిపుచ్చినట్టు  తెలుస్తోంది.

మరోవైపు మీడియాతో అభిషేక్ మాట్లాడుతూ, విచారణకు తాను అన్ని విధాలా సహకరిస్తానని చెప్పారు. కేసు కోల్ కతాకు చెందినదని, అయినప్పటికీ తనకు ఢిల్లీ సమన్లు జారీ చేస్తున్నారని విమర్శించారు. గత నవంబర్ లో తాను చేసిన సవాల్ కు కట్టుబడి ఉన్నానని… తాను తప్పు చేసినట్టు కేంద్ర విచారణ ఏజెన్సీ నిరూపిస్తే పోడియంలో ఉరి వేసుకుని చనిపోతానని చెప్పారు.