రూ 100 కోట్ల శ‌శిక‌ళ‌ ఆస్తుల‌ అటాచ్

ఏఐఏడీఎంకే బ‌హిష్కృత నేత‌, త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌య‌లలిత స‌న్నిహితురాలు వీకే శ‌శిక‌ళ‌కు చెందిన రూ 100 కోట్ల మేరకు విలువగల  ఆస్తుల‌ను ఆదాయ ప‌న్ను శాఖ బుధ‌వారం బినామీ లావాదేవీల నిషేధిత చ‌ట్టం కింద‌ అటాచ్ చేసింది. చెన్నై శివార్ల‌లోని ప‌య్య‌నుర్ గ్రామంలోని 11 ఆస్తుల‌ను ఐటీ అధికారులు అటాచ్ చేశారు. 

జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1991-1996 మధ్య 24 ఎకరాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కోర్టు ఆదేశాల మేరకు ఐటీ విభాగం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ అప్పట్లో రూ.20 లక్షలు ఉండగా ఇప్పుడు దాని విలువ ఏకంగా రూ.100 కోట్లకు చేరింది. కాగా గ‌త ఏడాది శ‌శిక‌ళ‌, ఆమె స‌న్నిహితుల‌కు చెందిన చెన్నైలోని దాదాపు 65 ప్రాప‌ర్టీల‌ను ఐటీ శాఖ అటాచ్ చేసింది.

2019లో రూ.1,600 కోట్ల ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. 2017లో 187 ఆస్తులపై తనిఖీలు జరిగాయి. రూ.1,430 కోట్ల పన్ను చెల్లించలేదని శశికళపై అభియోగాలు ఉన్నాయి.1991 జూలై నుంచి ఏప్రిల్‌ 1996 వరకు శశికళ బంధువు ఇళవరసి, వీఎన్‌ సుధాకరన్‌ పేర్ల భారీగా ఆస్తుల కొనుగోళ్లు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. 

ఇక అవినీతి కేసులో నాలుగేండ్ల జైలు శిక్ష అనుభవించిన 67 ఏళ్ళ  శ‌శిక‌ళ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో తిరిగి త‌మిళనాడుకు చేరుకున్న సంగ‌తి తెలిసిందే. రూ 66 కోట్ల అక్ర‌మాస్తుల కేసులో దోషిగా తేలిన శ‌శిక‌ళ 2017 నుంచి జైలులో ఉన్నారు. జ‌య‌ల‌లితతో కుమ్మ‌ క్కై శ‌శిక‌ళ నేర‌పూరిత కుట్ర‌కు పాల్ప‌డి ఆదాయం కంటే అధికంగా ఆస్తుల‌ను ఆర్జించార‌నే అభియోగాలు ఆమెపై న‌మోద‌య్యాయి. 

అక్రమాస్తుల కేసులో ఇంకా ఆమెపై విచారణ కొనసాగుతోంది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కీలక పాత్ర పోషిస్తుందని అందరూ ఊహించగా అనూహ్యంగా ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించి సంచలనం సృష్టించారు. ప్రస్తుతం ఆమె మళ్లీ రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నట్లు ఇటీవల జరిగిన పరిణామాలను చూస్తుంటే తెలుస్తోంది.