సాధువుల అరెస్ట్ హిందూమతంపై దాడి!

జూబ్లీహిల్స్ హనుమాన్ దేవాలయం సంఘటనలో 15 మంది సాధువులను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్  ఇది ముమ్మాటికి హిందూ మతంపై దాడేనని ఆరోపించారు. సామరస్యపూర్వకంగా ఈ  సమస్యను పరిష్కరించాలని ఆయన సూచించారు. 

టిఆర్ఎస్ ప్రభుత్వ ఒత్తిడితోనే పోలీసులు  సాధువుల అరెస్టులకు పాల్పడ్డారని సంజయ్ విమర్శించారు. శాంతియుత జీవితం గడిపే సాధువులను అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. భూవివాదాన్ని ఆసరాగా చేసుకుని అధికార పార్టీ నాయకులు వెనక ఉండి ఈ కూల్చివేత తతంగాన్ని నడిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నియంతృత్వ, నిరంకుశంగా వ్యవహరిస్తోన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై, జర్నలిస్టులపై, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై అక్రమ కేసులు బనాయిస్తూ, అరెస్టులకు పాల్పడబోతుందని ధ్వజమెత్తారు. చివరకు రాజకీయాలకు అతీతంగా సమాజం కోసం పనిచేస్తూ.. దైవ చింతనలో గడిపే సాధువులను కూడా వదిలిపెట్టకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. 

15 మంది సాధువుల అరెస్టును హిందూ సమాజంపై దాడిగానే పరిగణించాల్సి ఉంటుందని సంజయ్ స్పష్టం చేశారు.  టిఆర్ఎస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేకిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇతర మతాలకు సంబంధించిన ప్రార్థన స్థలాలపై చర్యలు తీసుకోవడానికి సంకోచించే ఈ ప్రభుత్వం.. హిందూ ఆలయాలపై మాత్రం బలగాలను అడ్డుపెట్టుకొని కూల్చివేతలకు పాల్పడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అరెస్టులతో ఈ సమస్యను పరిష్కరించలేమని టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఏ వర్గం మనోభావాలు దెబ్బతినకుండా సమస్యను శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.