ఐదుగురు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. జైలు శిక్షపై అప్పీలుకు వెళ్లేందుకు నెల రోజుల పాటు శిక్షను సస్పెండ్ చేసింది.
నెల్లూరు జిల్లాకు చెందిన తాళ్లపాక సాయి బ్రహ్మ అనే వ్యక్తికి నష్టపరిహారం చెల్లించకపోవటంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. కోర్టు ఆదేశించినప్పటికీ సాయి బ్రహ్మకు న్యాయం చేయకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్కు నెల రోజుల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది. అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరిరావుకు 2 వారాల జైలు శిక్ష, జరిమానా విధించింది.
ఐఏఎస్ అధికారి రావత్కు నెల రోజుల జైలు శిక్ష, వేయి రూపాయల జరిమానా, ముత్యాల రాజుకు రెండు వారాల జైలు శిక్ష, జరిమానా, ఏఎంబీ ఇంతియాజ్కు రెండు వారాల జైలు శిక్ష, జరిమానా విధించింది. అధికారుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి పిటిషనర్కు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇన్సైడర్ ట్రేడింగ్ కేసుల కొట్టివేత
మరోవంక, జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, మరికొందరిపై..ఇన్సైడర్ ట్రేడింగ్, అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన కేసులను గురువారం హైకోర్టు కొట్టేసింది. దమ్మాలపాటి ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారంటూ అవినీతి చట్టంకింద ఆయనపై ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇటీవల ఈకేసు విచారణకు రాగా.. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఎక్కడ జరగలేదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్ధిస్తూ.. ఈ కేసును నెల రోజుల్లో విచారణ చేయాలని ఏపీ హైకోర్టును ఆదేశించింది.
దీంతో సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను ఏపీ ప్రభుత్వం విత్ డ్రా చేసుకుంది. ఈకేసుకు సంబంధించి హైకోర్టులో గత నెలరోజులుగా వాదనలు జరిగాయి. అనంతరం తీర్పును రిజర్వు చేసింది. గురువారం జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ బెంచ్ ముందు కేసుల విచారణ జరిగింది.
దమ్మాలపాటితో పాటు ఆయన బంధువులు, కుటుంబీకులపై చేసిన ఆరోపణలు నిరాధారమని, ఎక్కడా రుజువులు లేవని న్యాయస్థానం పేర్కొంటూ కేసులను కొట్టేసింది. అలాగే ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. దమ్మాలపాటిపై అన్యాయంగా కేసులు పెట్టి మానసిక వేదనకు గురిచేసినందుకు ఆయన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది.
More Stories
ధర్మవరంలో బిజెపి కార్యకర్తలలపై రెచ్చిపోయిన వైసీపీ మూకలు
బీజేపీ గెలుపు మన దేశానికి అవసరం
ఏపీలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సీఆర్పీఎఫ్ బలగాలు