మంత్రి సురేష్ దంపతులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ విద్యాశాఖ మంత్రి, మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి ఆదిమూలపు సురేశ్‌, ఆయన సతీమణి ఐఆర్‌ఎస్‌ అధికారి టీఎన్‌ విజయలక్ష్మిపై ప్రాథమిక విచారణ జరిపి, తాజాగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశించింది. 

ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. మంత్రి సురేశ్‌ ఆయన సతీమణి విజయలక్ష్మి ఇద్దరూ ఐఆర్‌ఎస్‌ అధికారులు. అయితే, సురేశ్‌ రాజకీయాల్లోకి వచ్చారు.

సీబీఐ అధికారులు 2016లో దేశవ్యాప్తంగా పలువురు ఐఆర్‌ఎస్‌ అధికారుల ఇళ్లపై దాడులు చేశారు. ఈ క్రమంలో 1992 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి విజయలక్ష్మిపై కేసు నమోదు చేసి, 2017లో ఎఫ్‌ఐఆర్‌ కట్టారు. దీనిలో విజయలక్ష్మిని ప్రధాన నిందితురాలిగా, సురేశ్‌ను రెండో నిందితునిగా పేర్కొన్నారు. అయితే.. తమపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ముందు సీబీఐ ఎలాంటి ప్రాథమిక విచారణ జరపలేదని, దీనిని కొట్టి వేయాలని కోరుతూ.. సురేశ్‌ దంపతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

అక్కడ వీరికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే.. తెలంగాణ హైకోర్టు తీర్పును సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. దీనిపై జరిగిన విచారణలో సీబీఐ తరఫున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. అన్ని ఆధారాలతోనే సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిందని, ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టారనే అభియోగాలపై పక్కా ఆధారాలు ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం జోక్యం చేసుకుని.. ఆయా విషయాలను అఫిడవిట్‌లో ఎందుకు పేర్కొనలేదని, ప్రాథమిక విచారణ అవసరం లేదని సీబీఐ భావించిందా? అని ప్రశ్నించింది. తెలంగాణ హైకోర్టు వర్చువల్‌ విధానంలో ఈ కేసును విచారించిందని హైకోర్టు గుర్తు చేసింది. ఆతీర్పును పక్కన పెడుతున్నామని, ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ముందు ప్రాథమిక విచారణ జరిపారో లేదో సమాధానం చెప్పాలని సీబీఐని కోరింది. అదేసమయంలో మరోసారి ప్రాథమిక విచారణ జరిపి, తాజాగా కేసు నమోదు చేయాలని ఆదేశించింది.