
దేశంలో డ్రోన్ల నిర్వహణకు సంబంధించిన నియమనిబంధనలను కేంద్రం మరింతగా సరళీకృతం చేసింది. దీని మేరకు డ్రోన్లు నడిపించే వారు కేవలం ఐదు ఫారంలు నింపితే చాలు. నాలుగు రకాల రుసుంలు చెల్లిస్తే సరిపోతుంది. ఇప్పటివరకూ డ్రోన్ల నిర్వహణకు ముందుకు వచ్చే వారు పాతిక వరకూ ఫారాలు నింపాల్సి ఉండేది.
పైగా, పలు నిబంధనలపై వివరణలు ఇచ్చుకోవల్సి వచ్చేది. ఇక వివిధ స్థాయిలో 72 రకాల ఫీజులు వసూళ్లు జరిగేవి. అయితే ఇప్పుడు సరళీకృత దశలతో ఇకపై కేవలం 4 రకాల ఫీజులు చెల్లిస్తే సరిపోతుంది. డ్రోను రూల్స్ 2021 పేరిట నోటీఫికేషన్ను కేంద్రం వెలువరించింది.
కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నూతన డ్రోన్ రూల్స్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. స్టార్టప్ కంపెనీలు ఈ నిబంధనల వల్ల ప్రయోజనం పొందుతాయని చెప్పారు. నవ కల్పనలు, వ్యాపార రంగం బలోపేతమవడానికి ఈ రూల్స్ దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ నిబంధనలు అనుగుణ్యత అవసరాలను (కాంప్లియెన్స్ రిక్వైర్మెంట్స్ను), ఎంట్రీ ఆటంకాలను తగ్గిస్తాయని తెలిపారు. ఈ కొత్త నిబంధనలు భారత దేశ డ్రోన్ల రంగానికి గొప్ప నిర్ణయాన్ని పరిచయం చేస్తున్నాయని మోదీ ఓ ట్వీట్లో చెప్పారు.
ఇంతకు ముందటి యుఎఎస్ రూల్స్ స్థానంలో వీటిని తీసుకువచ్చారు. పాత రూల్స్ ఈ ఏడాది మార్చిలోనే అమలులోకి వచ్చాయి. డ్రోన్ల సైజుతో సంబంధం లేకుండా ఇప్పుడు ఫీజులను సరళీకృతం చేస్తూ కొత్త నిబంధనలలో చేర్చారు. ఇతరత్రా కూడా డ్రోన్ల నిర్వహణకు ఎక్కువగా అవకాశం కల్పించారు.
ఉదాహరణకు రిమోట్ పైలెట్ లైసెన్సును అన్ని కేటగిరీల డ్రోన్లకు ఇంతకు ముందటి రూ 3000 నుంచి కేవలం రూ 100కు కుదించారు. ఈ లైసెన్సు పది సంవత్సరాలు చెల్లుతుంది. అంతేకాకుండా వివిధ స్థాయిల అనుమతుల అవసరం ఉండదు.
అదే విధంగా డ్రోన్లకు విభిన్న సంఖ్య, ఇంజన్ నెంబర్లు, తయారీదారు సర్టిఫికేట్లు , గాలిలో ప్రయాణ సామర్థం వంటి వాటిపై పత్రాల విషయంలో కూడా సడలింపులు జరిగాయి. ఇక గ్రీన్ జోన్లలో 400 అడుగుల ఎత్తు వరకూ డ్రోన్ల సంచారానికి ఎటువంటి అనుమతులు అవసరం లేదు. అయితే ఎయిర్పోర్టుల పరిధిలోని 8 12 కిలోమీటర్ల లోపున నిబంధనలు వర్తిస్తాయి. సరిహద్దులలో డ్రోన్ల సంచారంతో కలవరం దశలోనే వీటి నిర్వహణకు సంబంధించి వెసులుబాట్లు కల్పించడం ప్రధాన అంశం అయింది.
More Stories
48 స్థానాలతో బిజెపి విజయకేతనం
కుంభమేళాలో పాల్గొన్న పాక్ హిందువులు
జమ్ముకశ్మీర్లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత