హుజురాబాద్‌లోనే కాదు 2023 లోనూ గెలుపు బిజెపిదే

హుజురాబాద్‌లోనే కాదు 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపు బిజెపిదేనని బిజెపి సీనియర్ నేత, మాజీ ఎంపి విజయశాంతి భరోసా వ్యక్తం చేసారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు సంబంధించిన ఆడియో సాంగ్స్‌ను విజయశాంతి విడుదల చేశారు. ఈ నెల 28 నుండి చేపట్టనున్న రాష్ట్ర వ్యాప్త యాత్రకు బిజెపి శ్రేణులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ పాదయాత్ర పాటల లిరిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నారు. గుండెను హత్తుకునేలా భావోద్వేగపూరితంగా పాటలున్నాయని తెలిపారు. తెలంగాణ మారుమూల ప్రాంతాల ప్రజలను ఆకట్టుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పాటల రాసిన వారందరికీ తన అభినందనలు తెలిపారు. 

బండి సంజయ్ చేపట్టనున్న పాదయాత్ర విజయవంతం అవుతుందనే సంపూర్ణ నమ్మకం తననకుందని ఆమె చెప్పారు. ఈ యాత్రలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరుతున్నామని విజయశాంతి పిలుపునిచ్చారు. బిజెపి క్రమశిక్షణ, సిద్ధాంతాలున్న పార్టీ, కేంద్రం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.

హుజూరాబాద్‌లో జరిగే ఉప ఎన్నికల్లోనూ బిజెపి గెలుపు ఖాయమని చెబుతూ బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని విజయశాంతి జోస్యం చెప్పారు. బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం  ఈ నెల 24 నుంచి యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా  ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్ మరణం వల్ల వాయిదా పడింది. 

పార్టీ పరంగా మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని బిజెపి అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 28న ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మీ ఆలయం నుంచి యాత్ర ప్రారంభం కానుంది.