ఏపీలో జాతీయ ఎస్సీ కమిషన్‌ సెల్‌

ఆంధ్ర ప్రదేశ్ లో ఎస్సీలపై జరుగుతున్న వేధింపులు, అఘాయిత్యాలు, దాడుల ఘటనలకు సంబంధించి వస్తున్న వినతుల పరిష్కారానికి రాష్ట్రం లో జాతీయ ఎస్సీ కమిషన్‌ తరఫున ఒక ప్రత్యేక సెల్‌ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కమిషన్‌ ఉపాధ్యక్షుడు అరుణ్‌ హల్దర్‌ వెల్లడించారు.
గుంటూరులోని పరమాయకుంటలో ఈ నెల 15న జరిగిన విద్యార్థిని రమ్య హత్యఘటనకు సంబంధించిన వాస్తవాలను తెలుసుకునేందుకు అరుణ్‌ హల్దర్‌ నేతృత్వంలో సుభాశ్‌ పార్థి, అంజు బాల, డైరక్టర్‌ సునీల్‌ కుమార్‌తో కూడిన బృందం మంగళవారం గుంటూరుకు వచ్చింది. తొలుత రమ్య కుటుంబసభ్యులతో హల్దర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా హత్యకు సంబంధించిన అన్ని విషయాలను వారికి వివరించినట్టు రమ్య కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. హత్య జరిగిన తీరు, అనంతరం పోలీసులు, ప్రభుత్వ స్పందించిన తీరును వివరించామని పేర్కొన్నారు.

రమ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం.. ఎస్సీ కమిషన్‌ సభ్యులు అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కమిషన్‌ ఉపాధ్యక్షుడు అరుణ్‌ హాల్దర్‌ మీడియాతో మాట్లాడుతూ ఎస్సీలపై దాడులు, అత్యాచారాలకు సంబంధించి అందిన వినతులపై తగు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. 

రమ్య హత్య కేసులో గుంటూరు డీఐజీ నేతృత్వంలోని అధికారుల బృందం సత్వరమే స్పందించిందని తెలిపారు. కాగా, ఎస్సీ కమిషన్‌ బృందం భేటీలో సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎస్సీల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. 

డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మాట్లాడుతూ.. రమ్య హత్య ఘటనలో యుద్ధప్రాతిపదికన దర్యాప్తు చేపట్టి, చార్జిషీట్‌ నమోదు చేశామని చెప్పారు. కాగా, జాతీయ ఎస్సీ కమిషన్‌ బృందం మంగళవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్‌ మోహన్ రెడ్డి లను మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ఎస్సీ కమిషన్‌ సభ్యులను ముఖ్యమంత్రి ఘనంగా సత్కరించారు.