ఆఫ్ఘన్ హిందూ, సిఖ్ లను చూడండి…. అందుకే సిఎఎ 

తాలిబన్ల అరాచక పాలన తిరిగి ప్రారంభం కావడంతో ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశం తన పౌరులను ఖాళీ చేయిస్తున్న సందర్భంగా  కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అవసరాన్ని మరోసారి ప్రస్తావించారు. అస్థిర పరిసరాల్లోని పరిణామాలు అటువంటి చట్టం అమలు చేయడానికి కారణమని స్పష్టం చేశారు.

“మన పొరుగు దేశంలో చోటుచేసుకున్న అస్థిర పరిణామాలతో  సిక్కులు, హిందువులు ఎదుర్కొంటున్నదారుణమైన పరిస్థితులు చూస్తున్నాము. అందుకే పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడం అవసరం” అని పూరి ట్వీట్ చేశారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరచట్టం సరైనదే అనే విషయం ఇప్పుడు అఫ్ఘనిస్థాన్ పరిణామాలతో స్పష్టం అయిందని  ఆయన స్పష్టం చేశారు. 

పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ల నుండి హిందు, సిక్కు, జైన్, బౌద్ధ, పార్సీ, క్రైస్తవ వర్గాలకు చెందిన హింసించబడిన మైనారిటీలు భారతదేశంలో పౌరసత్వం పొందడానికి సిఎఎ  అనుమతిస్తుంది. ఇటువంటి దశలో అటువంటి వారిని ఆదుకునేందుకు పౌరసత్వ సవరణ చట్టం అవసరం అయిందని, దీనిని విమర్శించిన వారు ఇప్పుడేం అంటారని ప్రశ్నించారు. 

ఈ మూడు దేశాలలో మతపరమైన హింస కారణంగా డిసెంబర్ 31, 2014 వరకు భారతదేశానికి వచ్చిన ఈ వర్గాలకు చెందిన వ్యక్తులు అక్రమ వలసదారులుగా పరిగణించబడరు. వారికి భారత పౌరసత్వం అందిస్తారు. వారం రోజుల క్రితం ఉగ్రవాద సంస్థ తాలిబన్ల ఆధిపత్యంలోకి వచ్చిన తర్వాత కాబుల్ నగరంలో భద్రతా పరిస్థితి క్షీణిస్తున్న నేపథ్యంలో ఆఫ్ఘ‌నిస్థాన్‌లోని హిందువులు, సిక్కుల‌కు సాయం చేస్తామ‌ని భార‌త ప్ర‌భుత్వం హామీ ఇచ్చింది. సాయం అవ‌స‌ర‌మైన దేశంలోని వారి స్నేహితుల‌ను ఆదుకుంటామ‌ని పేర్కొంది.

ముగ్గురు అఫ్ఘాన్ చట్టసభ సభ్యులతో సహా 392 మందిని భారత్ ఆదివారం మూడు వేర్వేరు విమానాల్లో వెనక్కి తీసుకువచ్చింది. 107 మంది భారతీయులు, 23 మంది ఆఫ్ఘన్ సిక్కులు, హిందువులతో సహా మొత్తం 168 మందిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సి-17 హెవీ-లిఫ్ట్ మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో కాబూల్ నుండి ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు తరలించారు.

మరో 87 మంది భారతీయులు, ఇద్దరు నేపాల్ జాతీయులను ఐఎఎఫ్ 130జె రవాణా విమానంలో తజికిస్తాన్ రాజధానికి తరలించిన ఒక రోజు తర్వాత దుషాన్‌బే నుండి ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానంలో తిరిగి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. గతంలో, అమెరికా, నాటో విమానాల ద్వారా గత కొన్ని రోజులుగా కాబూల్ నుండి దోహాకు తరలించిన 135 మంది భారతీయులను ప్రత్యేక విమానంలో ఖతార్ రాజధాని నగరం నుండి ఢిల్లీకి తిరిగి తరలించినట్లు వారు తెలిపారు.

ఇలా ఉండగా, అఫ్ఘానిస్థాన్‌లో చిక్కుకున్న భారతీయులందరినీ సురక్షితంగా ఇండియాకు తరలించనున్నట్టు విదేశాంగశాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే తరలింపు ప్రక్రియను ప్రారంభించినట్టు ఆయన పేర్కొన్నారు. 

అఫ్ఘానిస్థాన్‌లో చిక్కుకున్న భారతీయులను సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి తరలించడం కోసం తరలింపు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసినట్టు చెప్పారు. తరలింపు ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం హెల్ఫ్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్టు వివరించారు. మెయిల్స్, ఫోన్ కాల్ ద్వారా వచ్చే ప్రతి విన్నపానికి స్పందిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం వద్ద ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం సుమారు 500 మంది భారతీయులు అఫ్ఘానిస్థాన్‌లో చిక్కుకున్నారని వెల్లడించారు