పార్లమెంటు హుందాతనానికి విఘాతం కలిగించడం తగదని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రతిపక్షాలకు హితవు పలికారు. సమస్యలపై పార్లమెంటులో నిరసన వ్యక్తం చేసే హక్కు ఉందని, అయితే సభ గౌరవానికి విఘాతం కలిగించడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రసాభాసగా ముగిసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
పెగాసస్ స్పైవేర్తో కొందరు ప్రముఖులపై నిఘా పెట్టినట్లు వచ్చిన ఆరోపణలపై పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. కొత్త సాగు చట్టాలపై కూడా చర్చ జరగాలని పట్టుబట్టాయి.
హర్యానా,రాజస్థాన్ లలోని ఏడు లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో జరిపిన 620 కి మీ జన ఆశీర్వాద్ యాత్ర ముగిసిన నేపథ్యంలో యాదవ్ మాట్లాడుతూ, చర్చల ద్వారా, హుందాగా పార్లమెంటు కార్యకలాపాలు జరగాలని పేర్కొన్నారు. సమస్యలను ప్రస్తావించి, ప్రభుత్వంపై నిరసన తెలిపే హక్కు ప్రతిపక్షాలకు ఉందని, అయితే పార్లమెంటు హుందాతనాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని చెప్పారు.
నిరసనలు, అంతరాయాలను అర్థం చేసుకోవచ్చునని, గందరగోళం సృష్టించడం సరికాదని విమర్శించారు. నూతన మంత్రులను సభకు పరిచయం చేయడానికి ప్రధాని మోదీకి అవకాశం లేకుండా చేశారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు తాము కోరుకున్నపుడల్లా సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నాయని దుయ్యబట్టారు.
రాజ్యసభలో చర్చ జరుగుతుండగా, ప్రతిపక్షాలు అధ్యక్ష స్థానంపైకి రూల్ బుక్ను విసరడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. జన ఆశీర్వాద్ యాత్రలో భాగంగా తాను 75 సమావేశాలు, ఏడు భారీ సభలను నిర్వహించానని చెప్పారు. రాజస్థాన్లో తదుపరి ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని భరోసా వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనపై స్పందిస్తూ “ఈ చట్టాలు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీని ఏ విధంగానూ రద్దు చేయవని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. రద్దీగా ఉంటే నగరంలో మరో మార్గం ఉండే విధంగా ఈ చట్టం ఏర్పాటు చేస్తుంది. బైపాస్ ద్వారా సదుపాయం కలిగిస్తుంది. చట్టాలు రైతులకు మరింత వ్యాపారం చేయడానికి మార్గం ఇచ్చాయి” అని స్పష్టం చేశారు.
More Stories
బిజెపి-ఎన్డిఎ తప్ప మరెవ్వరు ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు
దుమారం రేపుతున్న బెంగాల్ గవర్నర్ పై లైంగిక ఆరోపణలు
అమేథిలో కాంగ్రెస్ ఓటమిని అంగీకరించింది