సమాజ్‌వాదీ పార్టీ ఎంపీపై దేశద్రోహం కేసు

తాలిబాన్లను భారత స్వాతంత్య్ర సమరయోధులతో పోల్చినట్లు చేసిన వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ షఫీఖర్ రహ్మాన్ బార్క్, మరో ఇద్దరిపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. 

తాలిబాన్లను భారత స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చారని, వారి విజయాన్ని సంబరంగా జరుపుకున్నారని చంబల్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ చార్ఖేష్ మిశ్రా చెప్పారు. బిజెపి ప్రాంతీయ ఉపాధ్యక్షుడు రాజేష్ సింఘాల్ చేసిన ఫిర్యాదుపై ఈ కేసు నమోదు చేశారు. 

 ‘‘భారత ప్రభుత్వం ప్రకారం తాలిబాన్ ఒక ఉగ్రవాద సంస్థ. తాలిబాన్లపై చేసిన వ్యాఖ్యలు రాజద్రోహంగా పరిగణించవచ్చు. మేం ఎఫ్ఐఆర్ నమోదు చేశాం’’ అని ఎస్పీ మిశ్రా వీడియో ప్రకటనలో తెలిపారు.  ‘‘అఫ్ఘనిస్తాన్ స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటున్నాను, వారు దేశాన్ని నడపాలనుకుంటున్నారు’’ అని షఫీఖర్ బార్క్ విలేకరులతో వ్యాఖ్యలు చేశారు.

కాగా, ఢిల్లీలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు, మౌలానా సజ్జాద్ నోమాని కూడా ఆఫ్ఘనిస్తాన్‌ను విజయవంతంగా స్వాధీనం చేసుకున్నందుకు తాలిబాన్‌లను ప్రశంసించారు. ఈ హిందీ ముస్లిం మీకు సెల్యూట్ చేస్తున్నాడు” అంటూ మౌలానా తాలిబాన్‌లపై ప్రశంసలు కురిపించారు.

ప్రపంచలోని అత్యంత బలమైన శక్తులను తాలిబాన్‌ మట్టికరిపించిందని కొనియాడారు. ఆఫ్ఘనిస్తాన్‌ను తమ వశం చేసుకోవడంలో ఎలాంటి తప్పులేదని సజ్జాద్‌ నోమాని స్పష్టం చేశారు. వారు చేసింది ముమ్మాటికీ కరెక్టే అని అంటూ నిరాయుధ దేశం శక్తివంతమైన శక్తులను ఓడించడం మామూలు విషయం కాదని పేర్కొన్నారు.

శాంతి పార్టీ అధికార ప్రతినిధి షాదాబ్ చౌహాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్‌లో ‘శాంతియుతంగా’ అధికార మార్పిడి చేసినందుకు తాలిబాన్‌లను అభినందించారు.