పెగాసస్ వివాదంలో “దాచడానికి ఏమీ లేదు” అని పేర్కొంటూ ఈ విషయం “జాతీయ భద్రత” కి సంబంధించినదని కేంద్రం మంగళవారం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. మరోవంక, జాతీయ భద్రతకు రాజీపడే అంశాలను ప్రభుత్వం వెల్లడించాలని సుప్రీం కోర్ట్ కోరుకోవడం లేదని బెంచ్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు స్పష్టం చేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి ఈ విషయమై నోటీసు జారీ చేసింది. ఇజ్రాయిల్ స్పైవేర్ స్నూపింగ్ కోసం ఉపయోగించినదనే ఆరోపణలపై ప్రభుత్వం పది రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని చెబుతూ, సమాధానం అందుకున్న తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తుంది. జస్టిస్ సూర్య కాంత్, అనిరుద్ధ బోస్లతో కూడిన ధర్మాసనం నిర్ణయించింది.
ఈ విషయం “బహిరంగ చర్చకు లోబడి ఉండదు” అని పేర్కొంటూ “ఈ సాఫ్ట్వేర్ ప్రతి దేశం కొనుగోలు చేస్తుంది. సాఫ్ట్వేర్ ఉపయోగించకపోతే పిటిషనర్లు దానిని బహిర్గతం చేయాలని కోరుతున్నారు. మేము దీనిని బహిర్గతం చేస్తే, ఉగ్రవాదులు నివారణ చర్యలు తీసుకోవచ్చు. ఇవి జాతీయ భద్రతా సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. మేము కోర్టు నుండి ఏమీ దాచలేము” అని తుషార్ మెహతా సుప్రీం కోర్ట్ కు తెలిపారు.
వివరాలను నిపుణుల కమిటీకి సమర్పించవచ్చని మెహతా తెలిపారు. “మేము దీనిని నిపుణుల కమిటీకి బహిర్గతం చేయవచ్చు. ఇది తటస్థంగా ఉంటుంది. ఒక రాజ్యాంగ న్యాయస్థానంగా మీరు ఇలాంటి సమస్యలను కోర్టు ముందు వెల్లడించాలని, బహిరంగ చర్చకు పెట్టాలని భావిస్తున్నారా?” అంటూ అనుమానం వ్యక్తం చేశారు.
నిపుణుల కమిటీ ఈ అంశాలను పరిశీలిస్తోందని, వీటిపై బహిరంగంగా చర్చించలేమని తుషార్ మెహతా కోర్టుకు నివేదించారు. నిపుణుల కమిటీ తన నివేదికను కోర్టుకు అందచేస్తుందని, కానీ ఈ అంశాలను తాము ఎలా సంచలనాత్మకం చేయగలమని ఆయన వాదించారు.
పెగాసస్ స్పైవేర్ వాడకం ద్వారా నిఘా ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు జరుపుతోంది. సోమవారం విచారణ సందర్భంగా, పెగాసస్ విషయంలో పిటిషనర్లు చేసిన ఆరోపణలన్నింటినీ కేంద్రం “నిస్సందేహంగా” ఖండించింది.
పైగా, సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో “కొన్ని స్వార్థ ప్రయోజనాల ద్వారా వ్యాప్తి చెందే తప్పుడు కథనాన్ని తొలగించే ఉద్దేశ్యంతో లేవనెత్తిన సమస్యలను పరిశీలించడం కోసం ఈ రంగంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కమిటీ సమస్య అన్ని కోణాల్లోకి వెళుతుంది” అని సూచించారు.
గ్లోబల్ మీడియా దర్యాప్తులో కనుగొన్న అంశాలపై విచారణ జరిపించాలని కోరుతూ అనేకమంది పిటిషనర్లు కోర్ట్ ను ఆశ్రయించారు. ప్రభుత్వ విమర్శకులతో సహా విస్తృత శ్రేణి టార్గెట్లు ఉపయోగించే ఫోన్లలోకి స్పైవేర్ ప్రవేశించడానికి ఉపయోగించి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, నేరస్థులు, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉపయోగించడం కోసం పెగాసస్ని “పరిశీలించిన ప్రభుత్వాలకు” మాత్రమే లైసెన్స్ ఇస్తున్నట్లు ఇజ్రాయెల్ సంస్థ స్పష్టం చేసింది.
More Stories
అమెరికా లేకపోతే ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?
కాంగ్రెస్ ను వివాదంలోకి నెట్టిన శ్యామ్ పిట్రోడా
దేశంలో కాషాయ కెరటం ఉప్పొంగుతోంది