ఒవైసీలకు పెంపుడు కుక్కలా కేసీఆర్ మారారు 

తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌  మజ్లిస్‌ నేతలు ఒవైసీలకు పెంపుడు కుక్కలా మారారని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ ధ్వజమెత్తారు. హిందూవాహిని ఆధ్వర్యంలో నిర్మల్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘అఖండ భారత్‌ దివస్‌’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

భైంసాలో ఇటీవల జరిగిన అల్లర్లలో కొందరు వ్యక్తులు హిందువులను మాత్రమే ఇబ్బందులు పెట్టారని, అలాంటి వారిలో ఏ ఒక్కరినీ వదలబోమని హెచ్చరించారు. పోలీసులు పక్షపాత ధోరణి విడనాడి పనిచేయాలని సూచించారు. హిందువుల ఐకమత్యమే దేశానికి బలం అని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను హిందువులు బొందపెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

అలాగే హిందూ సమాజానికి అతిపెద్ద శత్రువు కాంగ్రెస్సేనని అరవింద్ మండిపడ్డారు. ముస్లింల ఓట్ల కోసమే కాంగ్రెస్‌ నాటకాలాడుతోందని విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పెద్ద స్థాయిలో ఊహించుకుంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని అరవింద్‌ ఎద్దేవా చేశారు. 

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు మాట్లాడుతూ అఖండ భారతావనిని సాధించేందుకు ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆర్టికల్‌ 370 రద్దు ప్రధాని నరేంద్ర మోదీతో ఏవిధంగా సాధ్యమైందో అదేవిధంగా అఖండ భారత్‌ దివస్‌ పునర్నిర్మాణం సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమంలో హిందూవాహిని రాష్ట్ర అధ్యక్షుడు రాజవర్ధన్‌రెడ్డి, తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు హరిచందన్‌రెడ్డి, నిర్మల్‌ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.