పార్లమెంట్ లో లోతైన చర్చలు లేకపోవడంపై ఆందోళన

పార్లమెంట్ లో చట్టాలపై లోతైన చర్చలు జరగక పోవడంపై సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ ఆందోళన వ్యక్తం చేశారు.  75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సుప్రీంకోర్టులో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం సీజేఐ రమణ మాట్లాడుతూ నాణ్యమైన చర్చ లేకుండా చట్టాలు చేస్తే న్యాయపరమైన చిక్కులు ఏర్పడతాయని హెచ్చరించారు. 

 ప్ర‌స్తుతం పార్ల‌మెంట్ ప‌నితీరు తీవ్ర నిరాశ‌జ‌న‌కంగా ఉన్న‌ద‌ని, అస‌లు స‌రైన చ‌ర్చే జ‌ర‌గ‌డం లేద‌ని విమ‌ర్శించారు. చ‌ట్టాల‌పై స్ప‌ష్ట‌త లేదు. అస‌లు చ‌ట్టం ప్ర‌యోజ‌నం ఏంటో తెలియ‌దు. ఇది ప్ర‌జ‌ల‌కు తీవ్ర న‌ష్టం క‌లుగుతోందని చెప్పారు. ఏ చట్టం ఎందుకు చేస్తున్నారో, ఆ చట్టం ఉద్దేశం ఏమిటో తెలియకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

చట్ట సభల్లో న్యాయవాదులు, మేధావులు ఎక్కువగా లేకపోవడం వల్లే చట్టాలపై లోతైన చర్చ జరగడం లేదని సీజేఐ స్పష్టం చేశారు.  చట్టాల్లో ఎన్నో లోపాలుంటున్నాయని, దీంతో కోర్టుల్లో వ్యాజ్యాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఇలాంటి లోపభూయిష్ట చట్టాలు ప్రజలకు, ప్రభుత్వానికి భారంగా మారుతాయని విచారం వ్యక్తం చేశారు. 

న్యాయవాదులకు సంపాదనే పరమావధి కూడదని, వారు కూడా ఎక్కువగా  ప్రజా జీవనంలోకి, చట్టసభలలోకి రావాలని హితవు చెప్పారు. పార్లమెంట్‌లో ఒకప్పుడు న్యాయదిగ్గజాలు సభ్యులుగా ఉండేవారని, గతంలో చర్చల నాణ్యత అద్భుతంగా ఉండేదని తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రికీ చట్టంలోని శాస‌న వ్య‌వ‌స్థ‌పై అంద‌రికీ స్ప‌ష్ట‌త ఉండేదని చెప్పారు.

 పారిశ్రామిక వివాదాల చట్టంపై గతంలో పార్లమెంటులో జరిగిన చర్చను తాను స్వయంగా చూశానని, అప్పట్లో తమిళనాడుకు చెందిన సిపిఎం సభ్యుడు రామ్మూర్తి ఎంతో విపులంగా ఆ బిల్లును విశ్లేషించారని గుర్తు చేశారు.

 కార్మికులు, వివిధ రంగాలపై ఆ బిల్లు చూపే ప్రభావాన్ని ఎంపీ రామ్మూర్తి లోతుగా విశ్లేషించి చెప్పారని అంటూ ఇప్పుడు అలాంటి లోతైన విశ్లేషణ పార్లమెంట్‌లో కరువైందని సీజేఐ విచారం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల‌లో, మొదటి లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లో ఎక్కువగా న్యాయవాదులు ఉండేవారని గుర్తు చేశారు.