వెంకయ్య కంట తడి… ముందే లోక్‌స‌భ నిరవధిక వాయిదా

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజ్యసభలోకంటతడి పెట్టారు. పార్లమెంట్‌లో ఎంపీ ప్రవర్తిస్తున్న తీరుపై కలత చెందిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం రాజ్యసభలో పలువురు విపక్ష ఎంపీలు సభ చైర్మన్ స్థానం వద్దకు దూసుకెళ్లారు. 

మంగళవారం కూడా ఎంపీలు ఇదే తీరును ప్రదర్శించారు. ఆప్, కాంగ్రెస్ సభ్యులు పోడియం ఎదుట టేబుట్‌పైకి ఎక్కి ఆందోళన చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ ఏకంగా చైర్మన్ సీటుపైకి ఫైల్స్ విసిరేశారు. మంగళవారం జరిగిన ఈ ఘటనతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర కలత చెంది బుధవారం గద్గద స్వరంతో ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘చైర్మన్ పోడియం దేవాలయ గర్భగుడి లాంటిది. భక్తులు గర్భగుడి వరకు రావచ్చుకానీ లోపలకు రాకూడదు. ఇలాంటి ఘటనలు తరచూ జరగడం ఆవేదన కలిగించే విషయం. నిన్న రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.’’ అంటూ సభ్యులకు వెంకయ్య నాయుడు హితవు చెప్పారు.

స‌భ ప‌విత్ర‌త‌ను కాపాడ‌టంలో అంద‌రూ విఫ‌ల‌మ‌య్యారని చెబుతూ మంగ‌ళ‌వారం స‌భ‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌ను పూర్తిగా ప్ర‌జ‌ల‌కు చూపించాలని సూచించారు. కొంద‌రు స‌భ్యులు టేబుల్స్‌పై ఎక్కి కూర్చోవ‌డం బాధించింది అని వెంక‌య్య ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇలాంటి ప‌రిస్థితుల్లోనూ స‌భ‌ను న‌డ‌ప‌లేనంటూ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కూ రాజ్య‌స‌భ‌ను వాయిదా వేశారు. స‌భ‌లో ఇలాంటి పరిస్థితుల‌ను టీవీల్లో చూపించ‌డం లేద‌ని ప్ర‌జ‌లు చెబుతున్నారని అంటూ ఎందుకు చూపించ‌డం లేదో తనకు  తెలియ‌దని చెప్పారు. రాజ్య‌స‌భ టీవీ వీటిని చూపించాలి అని వెంక‌య్య స్పష్టం చేశారు.

మరోవంక, లోక్‌స‌భ నిర‌వ‌ధిక వాయిదా ప‌డింది. పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లో భాగంగా ఇవాళ లోక్‌స‌భ చివ‌రిసారి స‌మావేశ‌మైంది. నిజానికి ఈనెల 13 వ‌ర‌కు స‌భ‌లు జ‌ర‌గాల్సి ఉంది. కానీ గ‌త రెండు వారాల నుంచి విప‌క్షాలు స‌భ‌లో ఆందోళ‌న సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. స‌భా కార్య‌క్ర‌మాల‌ను విప‌క్షాలు అడ్డుకుంటున్నాయి.

దీంతో స్పీక‌ర్ ఓం బిర్లా ఇవాళ విప‌క్షాల తీరును త‌ప్పుప‌ట్టారు. ఈ సెష‌న్‌లో ఎన్ని గంట‌ల పాటు స‌భా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయో ఆయ‌న వెల్ల‌డించారు. ఈసారి స‌భా కార్య‌క్రమాల‌ను అనుకున్న‌ట్లు సాగ‌లేద‌ని, కేవ‌లం 22 శాతం మాత్ర‌మే ప్రొడ‌క్టివిటీ రికార్డు అయ్యింద‌ని పేర్కొన్నారు.  అంత‌కుముందు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ సీఎం వీర‌భ‌ద్ర సింగ్ మృతికి సంతాపం తెలిపారు. లోక్‌స‌భ‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ ఓం బిర్లా తెలిపారు. మంగ‌ళ‌వారం లోక్‌స‌భ‌లో 127వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లుకు ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే.