విధ్వంసకర రాజకీయాలకు బీజేపీలో స్థానం లేదని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. అటువంటి ఆలోచనలు బీజేపీకి ఉండబోవని తేల్చి చెప్పారు. బీజేపీ ఎమ్మెల్సీ ప్రసాద్ లాడ్ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో దేవేంద్ర తీవ్రంగా స్పందించారు.
ఇది బీజేపీ సంస్కృతి కాదని, బీజేపీకి తనదైన సిద్ధాంతం, పని సంస్కృతి ఉన్నట్లు తెలిపారు. బీజేపీ సిద్ధాంతాలు, పని సంస్కృతి నిర్మాణాత్మకమైనవి, అభివృద్ధిపై దృష్టి పెట్టేవి అని పేర్కొన్నారు. తాము ముందుగా ఎవరిపైనా దాడి చేయబోమని, అయితే ఎవరైనా తమపై దాడికి దిగితే, తాము దీటుగా స్పందిస్తామని స్పష్టం చేశారు.
శివసేన ప్రాబల్యంగల మహిమ్లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్సీ ప్రసాద్ లాడ్ శనివారం మాట్లాడుతూ, తాను ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ పెద్ద ఎత్తున పోలీసులను మోహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సేన భవన్’ను కూల్చేస్తామని శివసేన భయపడుతోందని అంటూ సమయం వచ్చినపుడు మనం ఆ పని కూడా చేయగలమని హెచ్చరించారు.
సేన భవన్కు దివంగత బాల్ థాకరేకు గొప్ప అనుబంధం ఉండటంతో బీజేపీ లాడ్ వ్యాఖ్యలపై వెంటనే స్పందించింది. నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేదంటే వివరణ ఇవ్వాలని లాడ్కు చెప్పింది. దీంతో లాడ్ ఓ వీడియో స్టేట్మెంట్ను విడుదల చేశారు.
దివంగత బాల్ థాకరే అంటే తనకు చాలా గౌరవమని తెలిపారు. సేన భవన్ పవిత్రమైనదని పేర్కొన్నారు. సేన భవన్కు వ్యతిరేకంగా తాను ఎలా మాట్లాడగలనని ప్రశ్నించారు. బీజేపీ శక్తిమంతమైనదనేది తన ఉద్దేశమని తెలిపారు. శివసేనపై తన బలాన్ని బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ నిరూపించుకుంటుందని చెప్పారు.
More Stories
నామినేషన్ ఉపసంహరించుకున్న ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి
రేజర్వేషన్లపై అమిత్ షా `నకిలీ వీడియో’పై ఎఫ్ఐఆర్
20 రోజులు కూడా సమావేశం కాని తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలు