జూలైలో జీఎస్టీ ఆదాయం రూ.1.16లక్షల కోట్లు

జూలై నెలలో కేంద్రానికి రూ.1.16లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం సమకూరింది. గతేడాది జూలైతో పోలిస్తే 33శాతం వృద్ధి నమోదైందని, ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్ సెకండ్, ధర్డ్ వేవ్ ఆందోళన మధ్య కూడా భారీగా ఆదాయం సమకూరడం గమనార్హం.
2020 సంవత్సరం జూలైలో వస్తుసేవల పన్ను ద్వారా రూ. 87,422 కోట్లు కాగా.. ఈ ఏడాది జూన్‌లో రూ.92,849 కోట్లు వచ్చింది. జూలైలో ఆదాయం రూ.1,16,393కోట్లకు పెరిగింది.
 
ఇందులో సెంట్రల్‌ జీఎస్టీ రూ.22,197కోట్లు, స్టేట్‌ జీఎస్టీ రూ.28,541 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ రూ.57,864 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.27,900కోట్లు సహా), సెస్‌ ద్వారా రూ.7,790 కోట్లు (వస్తువుల దిగుమతిపై వచ్చిన రూ.815కోట్లతో సహా) వచ్చాయని ఆర్థిక శాఖ పేర్కొంది.
 
వరుసగా ఎనిమిది నెలలు పాటు రూ.లక్ష కోట్లకుపైగా వచ్చిన జీఎస్టీ ఆదాయం గత జూన్‌లో రూ.లక్ష కోట్లకు దిగువకు పడిపోయింది. మే మాసంలో చాలా రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు, లాక్‌డౌన్‌లు అమలులో ఉన్నాయి. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందని, రాబోయే నెలల్లో సైతం జీఎస్టీ ఆదాయం భారీగా కొనసాగే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
కాగా 2021-22 తొలి త్రైమాసికంలో ఎర్నింగ్స్ డేస్ కారణంగా వసూళ్లు పెరిగినట్లు చెబుతున్నారు. అయితే గతేడాది ఇదే నెలతో పోల్చుకుంటే జీఎస్‌టీ ఆదాయం 33 శాతానికి పైగా పెరిగింది.
ఇక, గతేడాదితో పోల్చితే ఈసారి తెలుగు రాష్ట్రాల్లో జిఎస్‌టి వసూళ్లు పెరిగాయి. 2020 జులైలో ఎపిలో రూ.2,138 కోట్లు ఉండగా.. ఈ ఏడాది రూ.2,730 కోట్లు వసూలయ్యాయి. తెలంగాణకు సంబంధించి జిఎస్‌టి వసూళ్లు రూ.2,876 కోట్ల నుంచి రూ.3,610 కోట్లకు పెరిగాయి. తెలంగాణలో జిఎస్‌టి వసూళ్లు 26 శాతం పెరగగా.. ఎపిలో 28 శాతం పెరిగాయి.