జార్ఖండ్‌ జడ్జి మరణం రోడ్ ప్రమాదంలో కాదు, హత్య!

తొలుత రోడ్ ప్రమాదంలో మృతి చెందిన్నట్లు భావించిన జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లా, అదనపు జడ్జి ఉత్తమ్ ఆనంద్‌ను ఉద్దేశపూర్వకంగానే ఆటోతో ఢీకొట్టినట్లు సీసీటీవీ ఫుటేజ్‌ నిర్ధారణ చేస్తుంది.  ఆనంద్‌ను ఉద్దేశపూర్వకంగానే ఆటోతో ఢీకొట్టినట్లు సీసీటీవీ ఫుటేజ్‌ను బట్టి తెలుస్తోంది. 

బుధవారం ఉదయం వాకింగ్‌ చేస్తుండగా జడ్జి ఉత్తమ్ ఆనంద్‌ను గుర్తు తెలియని ఆటో ఇంటి నుంచి అర కిలోమీట‌ర్‌లోపే  ఢీకొట్టింది. చాలాసేప‌టి వ‌ర‌కూ ర‌క్తం మ‌డుగులో ఆయ‌న అలా రోడ్డుమీదే ప‌డి ఉన్న త‌ర్వాత ఓ వ్య‌క్తి గ‌మ‌నించి హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లగా.. అక్క‌డ ఆయ‌న మ‌ర‌ణించారు.కొద్ది గంటలపాటు ఆయనను ఎవరూ గుర్తించలేదు. ఆయన కనిపించడం లేదని బుధవారం ఉదయం 7 గంటల సమయంలో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు దర్యాప్తు చేసి, ఆటో ఢీకొనడంతో, ఆసుపత్రిలో మరణించిన వ్యక్తి ఉత్తమ్ ఆనంద్ అని గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు జడ్జి ఉత్తమ్ ఆనంద్‌ను ఆటో ఉద్దేశపూర్వకంగానే ఢీకొట్టినట్లు స్పష్టమవుతోందని చెప్పారు. ఆ ఆటోను కొద్ది గంటల క్రితమే దొంగిలించి, ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడైందని తెలిపారు.  

ఇదిలావుండగా, ఈ దుర్ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ను సామాజిక మాధ్యమాల్లో చూసినవారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై లోతైన దర్యాప్తు జరపాలని, దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు జడ్జి ఉత్తమ్ ఆనంద్ విచారణ జరుపుతున్న కేసులపై దృష్టి పెట్టారు.

ఇటీవలే ఆయన ఇద్దరు గ్యాంగ్‌స్టర్లకు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుసుకున్నారు. ఆయన ధన్‌బాద్‌లో చాలా హత్య కేసులపై విచారణ జరుపుతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ గురువారం సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ వద్ద ఈ కేసు గురించి ప్రస్తావించింది.

తాను జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో దీని గురించి మాట్లాడానని జస్టిస్ రమణ చెప్పారు. ఈ కేసును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేపట్టారని, ఈ కేసు గురించి తమకు తెలుసునని, తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతకుముందు న్యాయవాది వికాస్ సింగ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ కేసు గురించి ప్రస్తావించారు. ఇది న్యాయ వ్యవస్థపై నిస్సిగ్గుగా దాడి చేయడమేనని వ్యాఖ్యానించారు. ఈ కేసుపై సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) చేత దర్యాప్తు చేయించాలని కోరారు. 

ఇటువంటి విషయాల్లో స్థానిక పోలీసులు సాధారణంగా కుమ్మక్కు అవుతారని, ఇది చాలా దిగ్భ్రాంతికరమని చెప్పారు. ఉదయం వాకింగ్ చేస్తున్న జడ్జిని వాహనంతో ఢీకొట్టారని పేర్కొంటూ ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై దాడి అని పేర్కొన్నారు. ఈ ఫుటేజ్ సాధారణ సీసీటీవీ ఫుటేజ్ కాదని, దీనిని ఉద్దేశపూర్వకంగానే రికార్డు చేసి, సర్క్యులేట్ చేశారని వికాస్ సింగ్ తెలిపారు. ఈ వీడియోను చిత్రీకరిస్తున్నపుడు వ్యక్తులు మాట్లాడుకుంటుండటం వినిపిస్తోందని చెప్పారు.