రుణాంధ్ర ప్రదేశ్ గా ఏపీ, అప్పుల మంత్రిగా బుగ్గన్న 

ఆంధ్ర ప్రదేశ్ రుణాంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అప్పుల మంత్రి అయ్యారని బిజెపి రాజ్యసభ సభ్యులు జివిఎల్‌ నరసింహారావు విమర్శించారు.  ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అప్పుల కోసం బుగ్గన నానా పాట్లు పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. 
 
ఎపి ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఏ రోజుకు ఆ రోజు కొత్త అప్పుల కోసం ప్రయత్నిస్తున్నట్టుందని వ్యాఖ్యానించారు. అసలు అప్పులు చేయడం కోసమే ఎపి స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినట్టుగా అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఇది రాజ్యాంగ నిబంధనలను అతిక్రమించేలా ఉందని తెలిపారు. 
 
ఎపిలో ఆర్థిక సంక్షోభం రాజకీయ సంక్షోభంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎపి ప్రభుత్వం చేస్తున్న అప్పుల సంగతి దేశం మొత్తం తెలిసిందని, ఎపి అప్పులపై కాగ్‌, రిజర్వ్‌ బ్యాంక్‌లతో ఆడిట్‌ చేయాలని కేంద్రాన్ని కోరతానని వెల్లడించారు.