ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి విలేకరుల సమావేశంలోనో మరో బహిరంగ వేదికపైనో ఇచ్చే హామీల అమలుకు ప్రజలు న్యాయస్థానాల ద్వారా పట్టుబట్టవచ్చని ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కొవిడ్ కష్టకాలంలో ఇంటి అద్దె కట్టలేని వలస కార్మికుల అద్దె బకాయిలను తాము చెల్లిస్తామని గత ఏడాది మార్చిలో లాక్డౌన్ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన హామీపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడాన్ని తీవ్రంగా తప్బుబట్టింది.
కేజ్రీవాల్ ఎవర్ని దృష్టిలో ఉంచుకొని ఆ ప్రకటన చేశారో వారి విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ హామీ అమలుపై 6 వారాల్లో విధాన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభా ఎం.సింగ్ గురువారం తీర్పు వెలువరించారు.
సీఎం హామీ ఇచ్చిన సంక్షోభ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆ హామీఅమలుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ఏకపక్షం కిందకు రాదని, ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండటం చట్ట వ్యతిరేకం అవుతుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఒకసారి హామీ ఇచ్చాక ఆ హామీని అమలు చేయాలా వద్దా అనే విధాన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని స్పష్టం చేశారు.
నాటి హామీని లాక్డౌన్తో తీవ్రంగా నష్టపోయిన ఇంటి యజమానులు, కిరాయిదారుల వర్గాల గాయాలకు ఉపశమన లేపనంగా సీఎం ప్రకటించారని, అలాంటి హామీని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయకుండా పూర్తిగా విస్మరించిందో తెలియడం లేదని విస్మయం వ్యక్తం చేశారు.
లాక్డౌన్తో మొదలైన భారీ వలసల నేపథ్యంలో ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చేసిన ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను ప్రభుత్వం తేలిగ్గా పక్కన పెట్టడం కుదరదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీపై నిర్ణయం తీసుకున్నపుడే సరైన పాలన అనిపించుకుంటుందని తేల్చిచెప్పారు.
ఏమీ తేల్చకుండా నాన్చడం సమస్యకు సమాధానం కాదని 89 పేజీల తీర్పులో పేర్కొన్నారు. గత ఏడాది మార్చి 29న కేజ్రీవాల్ ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ కిరాయిదారులు, ఇంటి యజమానులు వేసిన పిటిషన్పై జస్టిస్ ప్రతిభ ఈ తీర్పునిచ్చారు. కిరాయి చెల్లించలేని వారు చెల్లించనక్కరలేదని నాటి విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ చెప్పారు.
ఇంటి యజమానులు కూడా కిరాయి కోసం బలవంతం చేయొద్దని, ఆ మొత్తాన్ని తాము చెల్లిస్తామని తెలిపారు. సీఎం ఇచ్చిన హమీ, వాగ్దానం లేదా చేసిన ప్రకటన స్పష్టంగా అమలు చేయదగ్గ వాగ్దానం అవుతుందని జస్టిస్ ప్రతిభ తన తీర్పులో స్పష్టం చేశారు. దాని అమలు అంశాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా పరిశీలించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు.
సుపరిపాలనలో పాలకులు ప్రజలకిచ్చిన హామీలను సహేతుకమైన, సమర్థనీయమైన కారణాల్లేకుండా పక్కన పెట్టరాదని స్పష్టం చేశారు. ఒట్టు వేసేదే గట్టున పెట్టేందుకనేది సామాజిక అంశాలకే పరిమితమయ్యే పాత నానుడి అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాలన విషయానికి వచ్చేసరికి ప్రభుత్వం, అధికారులు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా అమలు చేయాలన్న లక్ష్యంతోనే మాట తప్పడం కుదరని హామీలు(ప్రామిసరీ ఎస్టోపెల్), చట్టబద్ధ ఆకాంక్షల(లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్స్) సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయని ప్రస్తావించారు.
ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని ప్రభుత్వం ఎలాంటి సంశయం లేకుండా అంగీకరిస్తున్నపుడు దానిపై ఎలాంటి చర్యా లేకపోవడాన్ని ఏ మాత్రం అనుమతించరాదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాధినేతలుగా ఎన్నికైన వ్యక్తులు, బాధ్యతాయుత హోదాల్లో ఉన్నవారు సంక్షోభ సమయాల్లో తమ పౌరులకు బాధ్యతాయుత హామీలను ఇవ్వాలని ప్రజలు ఆశిస్తారని చెప్పారు.
ఢిల్లీ ప్రభుత్వ పాలన మొత్తం రాష్ట్ర లెఫ్ట్నెంట్ గవర్నర్ పేరిట జరుగుతుందని, ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు చట్టబద్ధత లేదని ప్రభుత్వం చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఆ కారణం చూపి ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పించుకోలేదని స్పష్టం చేసింది.
More Stories
డబ్బులేకే పోటీ చేయడం లేదు .. నిర్మలా
రేవంత్ పక్కన ఉన్నవాళ్లే ఫోన్ ట్యాపింగ్ చేశారు
రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు