తెలంగాణ అంటే హుజూరాబాద్ మాత్రమే అన్నట్టుగా సర్కారు పోకడ కనిపిస్తోందని బిజెపి నేత విజయశాంతి ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రిగారు చేసే వాగ్దానాల అమలు గురించి హుజూర్నగర్, నాగార్జునసాగర్ నియోజకవర్గాల ప్రజల్ని అడిగితే బాగా చెబుతారని చురకలంటించారు.
సీఎం కేసీఆర్కు ఒక్కసారిగా హుజూరాబాద్ నియోజకవర్గంపై ఎక్కడా లేని ప్రేమ పుట్టుకొచ్చిందని ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ దళిత బంధు పథకం’ ప్రకటించి, దీని అమలుకు పైలెట్ ప్రాజెక్ట్గా త్వరలో ఉపఎన్నికలు జరుగనున్న హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని, దీని వెనుక లోగుట్టు ఏమిటో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.
ప్రజలకు ఆమాత్రం తెలియదనుకుంటే అంతకంటే వెర్రితనం మరొకటి ఉండదని హితవు చెప్పారు. హుజూరాబాద్పై సీఎంగారి అంతులేని ప్రేమకు బీజాలు ఎప్పుడో పడ్డాయని అంటూ ప్రభుత్వ యంత్రాంగం, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులంతా ఈ నియోజకవర్గంలోనే దర్శనమిస్తూ రోడ్లు, ఫంక్షన్ / కమ్యూనిటీ హాళ్ళు అంటూ జనంపై వరాల జల్లు కురిపిస్తున్నారని ఆమె విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు స్కీంకు ఇప్పటికే రూ.1200 కోట్లు కేటాయించామన్నారని ఆమె గుర్తు చేశారు. ఇక తెలంగాణలోని సుమారు 20 లక్షల దళిత కుటుంబాల కోసం రూ 2 లక్షల కోట్ల నిధులు అవసరమవుతాయి. అసలు అంత బడ్జెట్ కేటాయించే పరిస్థితి ఉందా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు.
సీఎంగారి లెక్క ప్రకారం ఇదంతా కార్యరూపం దాల్చడానికి 165 సంవత్సరాలు పడుతుందని ఆమె ధ్వజమెత్తారు. చూస్తుంటే దళిత సీఎం… దళితులకు 3 ఎకరాల భూమి… అంటూ కేసీఆర్ గారు మరచిన వాగ్దానాలు… దళిత ఉప ముఖ్యమంత్రులకు దక్కిన మర్యాద లాగే ఈ దళిత బంధు కూడా ప్రకటనలకే పరిమితమయ్యే వ్యవహారం అనిపిస్తోందని విజయశాంతి ఎద్దేవా చేశారు.
More Stories
రుణమాఫీ అమలు చేస్తే రాజీనామాకు సిద్ధం
కేసీఆర్ పై ఈసీకి వీహెచ్పీ ఫిర్యాదు
విద్యా భారతి విజ్ఞాన కేంద్రంకు డా. భగవత్ తో ప్రారంభోత్సవం