మ‌హారాష్ట్ర‌లో బీజేపీ, ఎన్సీపీ ప్ర‌భుత్వం!

తరచూ సంచలన రాజకీయ ప్రతిపాదనలను తెరపైకి తెస్తుండే  కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ నేత రామ్‌దాస్ అథ‌వాలే తాజాగా మ‌హారాష్ట్ర‌లో బీజేపీ, ఎన్‌సీపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌నే అభిలాషను వ్యక్తం చేశారు. శ‌నివారం నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్య‌క్షుడు శ‌ర‌ద్ ప‌వార్‌, ప్ర‌ధాని న‌రేంద్రమోదీతో స‌మావేశం అయిన నేప‌థ్యంలో రామ్‌దాస్ అథ‌వాలే ఈ వ్యాఖ్య‌లు చేశారు.
అంతేగాక ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ప‌వార్ మ‌హారాష్ట్ర‌లో మ‌హా వికాస్ అఘాడీ కూట‌మి నుంచి బ‌య‌టికి వ‌చ్చి బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చేతులు క‌లుపాల‌ని కోరారు.  ప్ర‌ధాని మోదీ, శ‌ర‌ద్‌ప‌వార్ భేటీ నేప‌థ్యంలో రెండు పార్టీలు క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోతున్నాయ‌నే ఊహాగానాలు వెల్లువెత్తాయి.
దాంతో ఈ ఊహాగానాల‌పై ఎన్సీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మ‌హారాష్ట్ర మంత్రి న‌వాబ్ మాలిక్ స్పష్టత  ఇచ్చారు. బీజేపీ, ఎన్సీపీ పార్టీల మ‌ధ్య సిద్ధాంత‌ప‌ర‌మైన‌, రాజ‌కీయ ప‌ర‌మైన విభేదాలు ఉన్నాయ‌ని, అలాంటి రెండు పార్టీలు క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం సాధ్యం కాద‌ని చెప్పారు.
 అయితే ఈ వ్యాఖ్య‌ల‌పై కూడా అథ‌వాలే స్పందిస్తూ ప్ర‌స్తుతం ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన శివ‌సేన‌, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య కూడా రాజ‌కీయ‌ప‌ర‌మైన, సిద్ధాంత‌ప‌ర‌మైన విభేదాలు ఉన్నాయ‌ని, అయినా ఆ మూడు పార్టీలు క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాయ‌ని  గుర్తు చేశారు.  అలాంట‌ప్పుడు బీజేపీ, ఎన్సీపీ క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేయ‌లేవ‌ని ప్ర‌శ్నించారు.
 అంతేగాక‌ మ‌హారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు నానా ప‌టోల్ ఈ మ‌ధ్య త‌ర‌చూ శ‌ర‌ద్‌ప‌వార్‌కు వ్య‌తిరేకంగా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని తెలిపారు. అందుకే శ‌ర‌ద్‌ప‌వార్ త‌ప్ప‌కుండా కూట‌మి నుంచి వైదొలిగి బీజేపీతో చేతులు క‌లుపుతార‌ని భావిస్తున్నాన‌ని రామ్‌దాస్ అథ‌వాలే భరోసా వ్యక్తం చేశారు. అంతేగాక గ‌త ఏడాదికిపైగా కాంగ్రెస్ పార్టీ శివ‌సేన‌కే ఎక్కువ మద్దతు ఇస్తున్నదని,  ఎన్సీపీతో అంటిముట్ట‌న‌ట్టుగా ఉంటున్న‌ద‌ని వ్యాఖ్యానించారు. అందుకోస‌మైనా శ‌ర‌ద్‌ప‌వార్ కూట‌మిని వీడి బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని అథ‌వాలే సూచ‌న చేశారు.