ప్రకృతిని పరిరక్షించుకుందాం – ఆరోగ్యంగా జీవిద్దాం

ప్రకృతి పరిరక్షణ ప్రజాఉద్యమంగా రూపుదాల్చాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. ప్రకృతి పరిరక్షణను, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ ఆరోగ్యకరమైన భవిష్యత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. 

హైదరాబాద్ ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్ట్ లో కొనసాగుతున్న వివిధ శిక్షణా కార్యక్రమాలను పరిశీలించి, విద్యార్థులతో శుక్రవారం ముచ్చటించిన ఆయన, నాలుగో పారిశ్రామికీకరణ నేపథ్యంలో అవసరమైన నూతన నైపుణ్యాలతో యువత తమను తాము తీర్చిదిద్దుకోవాలని ఆకాంక్షించారు. అంతకు ముందు స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రాంగణంలో మొక్కను నాటారు.

ఫలితాన్ని పొందడానికి ఎంత శ్రద్ధాసక్తులు చూపిస్తారో, ఆ ఫలితాన్ని పొందడానికి ఉపయోగించే పద్ధతుల విషయంలో కూడా అంతే శ్రద్ధను చూపించాలన్న వివేకానందుని సూక్తిని ఉపరాష్ట్రపతి గుర్తు చేశారు. శ్రద్ధాసక్తులే భవిష్యత్ జీవితాన్ని నిర్దేశిస్తాయని, అందుకే ఇష్టపడి, కష్టపడితే నష్టపోయేది లేదని తెలిపారు.

రోజురోజుకీ పెరుగుతున్న శాస్త్రసాంకేతిక ప్రగతి అన్ని రకాల వృత్తి వర్గాల నుంచి నైపుణ్యాన్ని ఆశిస్తోందని, ఈ పరిస్థితుల్లో ఆర్థికరంగం పాతతరహాలో మనుగడ సాగించలేని స్థితి నెలకొందని చెప్పారు. గత మూడు పారిశ్రామిక విప్లవాల్లో ఉన్న నైపుణ్యాలు నాలుగో పారిశ్రామిక విప్లవంలో పూర్తిగా మారుతాయని చెప్పిన గ్లోబల్ బిజినెస్ కో ఎవల్యూషన్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ నివేదిక గురించి రాష్ట్రపతి ప్రస్తావించారు.

కేంద్రప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యావిధానంలో నైపుణ్యాభివృద్ధికి పెద్ద పీట వేశారని, స్కిల్ ఇండియా లాంటి పథకాలు సైతం ఈ బాధ్యతను తలకెత్తుకున్నాయని వివరించారు. ప్రభుత్వ చేస్తున్న కార్యక్రమాలు మాత్రమే సరిపోవని, విధాన నిర్ణేతలు, ఆర్థిక నిపుణులు, రాజకీయ నాయకులు దేశ భవిష్యత్ కోసం యువతను నైపుణ్యం వైపు నడిపించాలని, అదే సమయంలో పరిశ్రమలు సైతం తమకు కావలసిన నైపుణ్యాలతో యువతను తీర్చిదిద్దాలని సూచించారు.

గత కొన్నేళ్ళుగా సునామీలు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడడం లాంటి ఎన్నో ప్రకృతి విపత్తులను చూస్తున్నామని,  భూతాపం పెరిగిపోవడం, అడవుల్లో కార్చిచ్చులు, తీవ్రమైన కరువులు, వడగాలులు, తుఫానులు, వరదలు, అకాల వర్షాలు, మంచు పర్వతాలు కరగడంతో పాటు సముద్ర మట్టాలు పెరగడం వంటి పర్యావరణ విపత్కర మార్పుల గురించి వెంకయ్య నాయుడు ప్రస్తావించారు. 

అడవుల నరికివేత కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు వాతావరణంలో వాయు కాలుష్యం పెరుగుతోందని హెచ్చరించారు. చెరువులు, నదులు వంటి వాటిని ఆక్రమించుకోవడం కారణంగా వరదల ద్వారా ప్రకృతి ప్రకోపాన్ని మనం అనుభవిస్తున్నామని, మానవ తప్పిదాల కారణంగానే భూతాపం పెరుగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారని గుర్తు చేశారు. 

అభివృద్ధి చెందే క్రమంలో పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీల నుంచి పార్లమెంటు వరకు ప్రతి ఒక్కరూ ప్రకృతి పరిరక్షణలో భాగస్వామ్యం వహించాలన్న ఉపరాష్ట్రపతి, పర్యావరణ కాలుష్యానికి పాల్పడుతున్న వారిపైనా కఠినంగా వ్యవహరించాల్సిందేనని స్పష్టం చేశారు.  కార్పొరేట్ సంస్థలు తమ సి.ఎస్.ఆర్. నిధుల్లో ఒక వాటాను పూర్తిగా పర్యావరణ పరిరణ కోసం కేటాయించాలని కోరారు.

మానవుడికి, ప్రకృతికి మధ్య పరస్పర ఆధారిత వ్యవస్థ ఆవశ్యకతను కరోనా మహమ్మారి మనకు మరోసారి గుర్తు చేసిందని పేర్కొన్నారు. భూమిపై ఉన్న జీవజాతితో కలిసి జీవించడం ద్వారానే మానవజాతి మనుగడ సాధ్యమైందని తెలిపారు.