`లష్కరే’ కమాండర్‌, మరో ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు బుధవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా టౌన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తొయిబా కమాండర్‌ సహా మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. 
 
పుల్వామాలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బుధవారం తెల్లవారుజామున కశ్మీర్‌ పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా గాలింపు బృందాలపై ముష్కరులు కాల్పులు జరిపారని, ఈ సందర్భంగా వారిని లొంగిపోవాలని కోరామని కశ్మీర్‌ పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరపడంతో ప్రతిగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని పేర్కొన్నారు. వారిలో లష్కరే తొయిబా కమాండర్‌ ఐజాజ్‌ ఉన్నాడని తెలిపారు. మరో ఇద్దరు స్థానికులని, వారు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారనే విషయం తెలియాల్సి ఉందని వెల్లడించారు.
ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్ కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి.