`రజినీ మక్కల్‌ మండ్రం’ రద్దు చేసిన రజనీకాంత్

తనకు రాజకీయాలలో ప్రవేశించడం పట్ల ఆసక్తి లేదని మరో మారు స్పష్టం చేస్తూ రాజకీయ పార్టీ ప్రారంభంకు సన్నగా తన అభిమాన సంఘాలతో ఏర్పాటు చేసిన ‘రజినీ మక్కల్‌ మండ్రం’ ను రద్దు చేస్తున్నట్లు సూపర్ స్టార్ రజనీకాంత్ నేడు ప్రకటించారు. 
 
‘రజినీ మక్కల్‌ మండ్రం’ నిర్వాహకులతో నేడు సమావేశం ఏర్పాటు చేయడంతో ఆయన మళ్ళి రాజకీయ ప్రవేశం చేయనున్నారా అన్న ఆసక్తి కలిగించింది. సమావేశం అనంతరం  ప్రశ్నలన్నింటికీ రజినీకాంత్‌ సమావేశం అనంతరం ఓ క్లారిటీ ఇస్తూ ఓ లేఖ రాశారు. ఆ లేఖను తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. తనకు రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం లేదని మరోసారి స్పష్టం చేశారు. రజినీ మక్కల్‌ మండ్రంను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
 
 “రజిని మక్కళ్‌ మండ్రం నిర్వాహకులకు, సభ్యులకు, నన్ను బతికిస్తున్న దేవుళ్లయిన అభిమానులకు నా నమస్కారం. నేను రాజకీయాల్లోకి రాలేకపోతున్నానని ప్రకటించిన తర్వాత, రజనీ మక్కళ్‌ మండ్రం పని ఏంటి? పరిస్థితి ఏంటి? అని ప్రజలు, మక్కళ్‌ మండ్రం నిర్వాహకులు, అభిమానుల్లో అనుమానాలు తలెత్తాయి. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది” అని ఆ లేఖలో పేర్కొన్నారు. 
 
“నేను రాజకీయ పార్టీని ప్రారంభించి, అందులో పనిచేయడానికి తగ్గట్టుగా రజనీకాంత్‌ రసిగర్‌ నర్పణి మండ్రాన్ని… రజనీకాంత్‌ మక్కళ్‌ మండ్రంగా మార్చాను. రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లాల స్థాయిలోనూ  పలు పదవులను, పలు అనుబంధ బృందాలను ఏర్పాటు చేశాం. కానీ కాలం కలిసి రాకపోవడంతో మనం అనుకున్నది సాధ్యం కాలేదు” అని చెప్పుకొచ్చారు. 
 
” భవిష్యత్తులో రాజకీయాల్లో పాల్గొనే ఆలోచన నాకు లేదు. అందుకే, రజనీ మక్కళ్‌ మండ్రాన్ని రద్దు చేస్తున్నాను. అనుబంధ బృందాలు కూడా ఇక ఏవీ ఉండవు. ఇప్పుడు రజనీ మక్కళ్‌ మండ్రంలో ఉన్న కార్యదర్శులు, అడిషనల్‌, జాయింట్‌ సెక్రటరీలు, కార్యవర్గ సభ్యులతో ప్రజల సంక్షేమం కోసం.. ఇంతకు ముందు ఉన్నట్టే రజనీకాంత్‌ రసిగర్‌ నర్పణి మండ్రం పని చేస్తుంది” అని రజినీకాంత్‌ స్పష్టం చేసారు. 
కాగా, రాజకీయాల్లోకి ప్రవేశించాలని 2017లో నిర్ణయించుకున్న తలైవా.. గతేడాది అనారోగ్య కారణాలతో వెనక్కి తగ్గారు. రాజకీయాల్లో లేకున్నా ప్రజలకు సేవలు చేస్తానని పేర్కొన్నారు. ఈ నిర్ణయం తన ఫ్యాన్స్‌‌తోపాటు తనపై నమ్మకం పెట్టుకున్న వారిని నిరాశపరుస్తుందని, కాబట్టి తనను క్షమించాలని ఓ ప్రకటనలో రజనీ కోరారు.