ఉగ్రవాదంపై ప్రపంచమంతా సమిష్టిగా పోరాడాలని ఐరాస పిలుపునిచ్చింది. 20 ఏళ్ల క్రితం జరిగిన 9/11 ఉగ్రదాడులకు ముందు ఈ సమస్యను మీ ఉగ్రవాదులు, మా ఉగ్రవాదులు అన్న రీతిలో అంతర్జాతీయ సమాజం విభజించిందని విచారం వ్యక్తం చేసింది.
అయితే హింసాత్మక ఉగ్రవాదం, మితవాద ఉగ్రవాదం పేరుతో మరోసారి విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని భారత శాశ్వత ప్రతినిధి, ఐరాస రాయబారి టిఎస్.త్రిమూర్తి హెచ్చరించారు . ఈ సమస్యపై సమిష్టిగా పోరాడాలని ఆయన స్పష్టం చేశారు.
ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశంలో గ్లోబల్ కౌంటర్ టెర్రరిజమ్ స్ట్రాటెజీ (జిసిటిఎస్) 7వ తీర్మానంపై సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా టిఎస్.త్రిమూర్తి మాట్లాడుతూ ఉగ్రవాద ముప్పు తీవ్రమైన, సార్వత్రికమైనదని అంతర్జాతీయ సమాజం అంగీకరించిందని, ఈ సమస్యను అన్ని యుఎన్ సభ్య దేశాల సమిష్టి కృషి ద్వారానే ఓడించగలమని తీర్మానించాయని గుర్తు చేశారు.
ఉగ్రవాద దాడులు ఎక్కడ జరిగినా ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం వుంటుందని స్పష్టం చేశారు. మా భాగస్వాములకు హానికరం అనేది ఉగ్రవాదానికి నిర్వచనంగా మారిందని ఆయన చెప్పారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రయత్నాలను అధికం చేయడం యుఎన్ గ్లోబల్ కౌంటర్ టెర్రరిజమ్ స్ట్రాటజీ ప్రధాన ఉద్దేశమని యుఎన్ తెలిపింది.
2006లో ఏకాభిప్రాయం ద్వారా ఈ తీర్మానాన్ని స్వీకరించామని, దీంతో అన్ని యుఎన్ సభ్య దేశాలు ఉగ్రవాదంపై పోరాడేందుకు వ్యూహాత్మక, కార్యాచరణ విధానాన్ని చేపట్టేందుకు ముందుకు వచ్చాయని వెల్లడించింది. కాగా, గ్లోబల్ కౌంటర్ టెర్రరిజమ్ స్ట్రాటజీని 15 ఏళ్ల క్రితం ఏకాభిప్రాయంతో అవలంబించామని, ఇది అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాడటంలో సాధించిన గొప్ప అవకాశమని భారత ప్రతినిధి త్రిమూర్తి పేర్కొన్నారు.
More Stories
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై నాసా అధిపతి అనుమానం
ఐరాస సంస్కరణలకు అమెరికా మద్దతు
ఎడారి దేశం దుబాయ్లో కుండపోత వర్షం