తెలంగాణ నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మొట్టమొదటి కేబినెట్ మంత్రిగా తనకు అవకాశం రావడం గర్వంగా ఉందని కాబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం జి కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీలో సాధారణ కార్యకర్తకు అవకాశం దక్కుతుందనడానికి తనకు కేబినెట్ పదవి రావడమే ఒక నిదర్శనం అని చెప్పారు.
కిషన్రెడ్డికి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలు దక్కాయి. ఈ మూడు శాఖలకు అయిదుగురు సహాయ మం త్రులను కేటాయించారు. శ్రీపాద యశో నాయక్, అజయ్భట్లను కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రులుగా, మీనాక్షి లేఖి, అర్జున్ రాం మేఘ్వాల్లను సాంస్కృతిక శాఖ సహాయ మంత్రులుగా, బీఎల్ వర్మ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా వ్యవహరించనున్నారు.
హోం మంత్రి అమిత్ షాతో కలిసి పనిచేసిన అనుభవం ఎన్నటికీ మర్చి పోలేనని చెప్పారు. పార్టీకి– ప్రభుత్వానికి, ప్రజలకు–కార్యకర్తలకు మధ్య మంత్రిగా ఎలా సమన్వయం చేయాలో అమిత్ షా నుంచి నేర్చుకున్నానని తెలిపారు. కేంద్ర కేబనెట్ మంత్రిగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు సాయం చేయడంలో శక్తివంచన లేకుండా పని చేస్తానని కిషన్ రెడ్డి ప్రకటించారు.
రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ వ్యవహారాల్లో తప్పని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని స్పష్టం చేశారు.
ఈ రెండేళ్ళలో ఏ రోజూ అధిష్టానం వద్ద పదోన్నతి కోసం అడగలేదని కిషన్ రెడ్డి తెలిపారు. అలా అడిగే అవకాశం బీజేపీలో చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు. అయినా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనతో పాటు అనేక మందిని విస్తరణలో భాగంగా పార్టీ అగ్ర నాయకత్వం మంత్రులుగా అవకాశం ఇచ్చిందని గుర్తు చేశారు.
కేంద్ర మంత్రివర్గంలో బడుగు, బలహీనవర్గాల వారికి అత్యధిక ప్రాతినిధ్యం లభించిందని హర్షం ప్రకటించారు. కేంద్ర కేబినెట్ మంత్రిగా వెంకయ్యనాయుడు తర్వాత తనకు తెలుగు రాష్ట్రాల నుండి అవకాశం లభించిందని గుర్తు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా జమ్మూ, కశ్మీర్, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎక్కువగా పర్యటించిన కారణంగా గత రెండేళ్ళలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా అందుబాటులో ఉండలేకపోయానని చెప్పారు. ఇకపై తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తరఫున అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
తెలుగు రాష్ట్రాలకు పూర్తి సహకారం
‘సబ్ కే సాత్ సబ్ కే వికాస్’ అన్న రీతిలో తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. ఇటీవల పలు అంశాల్లో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం కోసం ప్రయత్నిస్తానుని తెలిపారు. “నాకు ఏ బాధ్యత అప్పగించినా, ఏ శాఖ కేటాయించినా, ఆ శాఖ ద్వారా తెలుగు ప్రజలకు మంచి పేరు తెచ్చేలా పనిచేస్తాను. తెలుగు ప్రజలు, నాకు ఓటేసిన ప్రజలు ఎప్పుడూ, ఏ సందర్భంలోనూ తలదించుకునే ఎలాంటి పనిచేయను” అని తెలుగు ప్రజలకు భరోసా ఇచ్చారు.
ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా పరిస్థితుల్లో భారత ప్రజలను సంఘటితం చేసి కరోనాపై పోరాడాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి పిలుపిచ్చారు. కరోనా కారణంగా గత ఏడాదిగా అదుపు తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, ఉద్యోగాల కల్పన, మౌలిక వసతులను మెరుగుపర్చే దిశగా కేంద్రం ముందుకెళ్తుందని తెలిపారు.
కాగా, ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణకు మణిహారమైన హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు పనుల పురోగతిపై చర్చించానని కిషన్ రెడ్డి వెల్లడించారు. అంతేగాక తెలంగాణకు సంబంధించి రైల్వే, ఇతర ప్రాజెక్టుల విషయంలో ఎప్పటికప్పుడు పురోగతిని తెలుసు కుంటున్నానని చెప్పారు.
హైదరాబాద్లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం కోసం తన వంతు కృషి చేశానని హామీ ఇచ్చారు. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో రాజకీయం చేయడం సహజం. ఒకరిపై ఒకరికి పోటీ ఉంటుంది. అయితే ఎన్నికల తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలన్నీ సమన్వయంతో కలసి పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
2019లో లోక్సభ సభ్యుడిగా గెలిచిన తర్వాత హోంశాఖ సహాయమంత్రిగా అమిత్ షా తీసుకున్న నిర్ణయాలు, తీసుకొచ్చిన చట్టాల అమలు విషయంలో తన వంతు ప్రయత్నం చేశానని తెలిపారు. జమ్మూ, కాశ్మీర్లో గతంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితి, ఉగ్రవాద బాధిత నేపథ్యంలో ఆర్టికల్ 370 తొలగించాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత అక్కడ ఎక్కువగా పర్యటించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
ఆర్టికల్ 370 తొలగింపు డిమాండ్ జనసంఘ్ సమయం నుంచి ఉంది. ఆర్టికల్ 370 తొలగింపు, పౌరసత్వ సవరణ చట్టం తేవడంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా తన వంతు పాత్ర పోషించానని కిషన్ రెడ్డి తెలిపారు. రెండేళ్ల పాటు అమిత్ షా తో కలసి పనిచేయడం మర్చిపోలేని అనుభవాన్ని ఇచ్చింది. కేంద్ర పాలిత ప్రాంతాల అభివృద్ధి, పరిపాలనా వ్యవహారాల్లో భాగమయ్యాను అని సంతృప్తి వ్యక్తం చేశారు.
“ప్రతిక్షణం పార్టీ కోసమే ఆలోచించాను. పార్టీ కోసమే పనిచేశాను. 1980 నుంచి ఈరోజు వరకు పార్టీ బలోపేతం కోసం నిరంతరం పని చేస్తూనే ఉన్నాను. సాధారణ కార్యకర్తగా ఎలాగైతే పనిచేశానో కేంద్రమంత్రిగాను ఒదిగి ఉంటూ అలాగే పని చేస్తాను” అని స్పష్టం చేశారు. .
బండి సంజయ్ అభినందనలు
కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జి.కిషన్రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలోని కిషన్రెడ్డి నివాసంలో ఆయనను కలసి సన్మానించారు. కిషన్రెడ్డి కృషికి, పార్టీకి చేసిన సేవలకు తగిన గుర్తింపుగా ఈ పదవి దక్కిందని తాను భావిస్తున్నానని చెప్పారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని చెప్పడానికి కిషన్రెడ్డికి కేబినెట్ హోదా దక్కడమే నిదర్శనమన్నీ పేర్కొన్నారు.
కాగా, కిషన్రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు టపాకాయలు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, సుభాష్ చందర్జీ తదితరులు పాల్గొన్నారు.
1980 నుండి రాజకీయ ప్రస్థానం
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్లో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రి వరకు ఎదిగారు. 1980 నుంచి 1994 వరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారు. 1980లో రంగారెడ్డి జిల్లా బీజేపీ యువమోర్చా కన్వీనరుగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.
1992లో యువమోర్చా జాతీయ కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా, 1993 నుంచి వరుసగా మూడుసార్లు జాతీయ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు.2004లో తొలిసారి హిమాయత్నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009, 2014 ఎన్నికల్లోనూ గెలుపొందారు.
2010 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 నుంచి 2016 వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో అంబర్పేట నుంచి ఓటమిపాలై, 2019 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. కేంద్ర సహాయ మంత్రిగా నియమితులయ్యారు.
More Stories
ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడి రాజీనామా
చిక్కుల్లో వినోద్ కుమార్ నామినేషన్
రుణమాఫీ అమలు చేస్తే రాజీనామాకు సిద్ధం