ఫోన్ కాల్స్ చేసి విసిగిస్తే రూ 10 వేలు జరిమానా

అత్యవసర పనుల్లో ఉన్నప్పుడు టెలిమేకర్స్‌, లోన్స్‌ కావాలంటూ అనవసరపు ఫోన్‌ కాల్స్‌ వస్తే చిర్రెత్తుకు వస్తోంది. ఒక్కో సందర్భంలో ఫోన్లను పగలకొట్టేయాలంత కోసం వస్తుంది. ఇలాంటి కాల్స్‌కు అడ్డుకట్టవేసేందుకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికం (డిఒటి) కసరత్తులు చేస్తోంది.
 
ప్రస్తుతం ఉన్న స్లాబ్‌ తగ్గిస్తూ , జరిమానాను భారీగా పెంచాలని నిర్ణయించింది. ఇకపై 0-10 ఉల్లంఘనలకు రూ. వెయ్యి, 10-50 ఉల్లంఘనలకు 5 వేల రూపాయలు, 50కు పైబడితే పదివేలు రూపాయలు జరిమానా విధించాలని నిర్ణయించింది. టెలికాలర్స్‌ కనుక 50కి పైగా ఉల్లంఘనకు పాల్పడితే ఆ తర్వాత వచ్చే ప్రతి కాల్‌, సంక్లిప్త సందేశాలకు రూ. 10 వేలు చొప్పున జరిమానా విధించాలని డిఒటి ప్రతిపాదించినట్లు టెలికాం వర్గాలు తెలిపాయి.
 
ప్రస్తుత టెలికం కమర్షియల్‌ కమ్యూనికేషన్స్‌ కస్టమర్‌ ప్రిఫరెన్స్‌ రెగ్యులేషన్‌ (టిసిసిసిపిఆర్‌) 2018 కింద ఉన్న స్లాబ్‌లు 0-100, 100-1000, 1000 కంటే పైన ఉన్నాయి. డిఒటికి చెందిన డిజిటల్‌ ఇంటెలిజన్స్‌ యూనిట్‌ (డిఐయు) డివైజ్‌ లెవల్‌లో ఉల్లంఘనకు తనిఖీ చేస్తుంది. 
 
అనుమానిత నంబర్లు కనిపిస్తే డిఐయు వెంటనే మెసేజ్‌ పంపిస్తుంది. రీ వెరిఫికేషన్‌ చేయడంలో విఫలమైతే కనుక ఆ నంబరును తొలగిస్తుంది. దీనికి సంబంధించిన ఐఎంఇఐ నంబరును అనుమానిత జాబితాలో చేరుస్తుంది.  అనుమానిత జాబితాలో ఉన్న ఈ నంబరు నుండి వచ్చే కాల్స్‌, మెసేజ్‌, డేటా అనుమతించదు. ఈ జాబితా కాలపరిమితి 30 రోజులుగా ఉంటుంది. గ్రేలిస్ట్‌లో ఉన్న ఐఎంఇఐ నంబరును ఉపయోగించి కొత్త కనెక్షన్‌తో కమ్యూనికేషన్‌ చేసే పెస్కీ కాలర్స్‌ను రీ వెరిఫికేషన్‌ కోరుతుంది. 
 
వారు కనుక డివైజ్‌ను మార్చేస్తే, దాని ఐఎంఇఐ నంబరును కూడా రీ వెరిఫికేషన్‌ పూర్తయ్యే వరకు అనుమానిత జాబితాలో ఉంచుతుంది. రీవెరిఫికేషన్‌ తర్వాత కూడా నిబంధనలను ఉల్లంఘిస్తే అప్పుడు ఆ నంబరు నుంచి వచ్చే కాల్స్‌, ఎస్సెమ్మెస్‌లను ఆరు నెలలపాటు రోజుకు 20కి పరిమితం చేస్తుంది.  ఆ తర్వాత కూడా ఉల్లంఘనలు కొనసాగితే ఆ నంబరును కొనుగోలు చేసేందుకు ఉపయోగించిన ఐడెంటిటీ, అడ్రస్‌ ప్రూఫ్‌ను రెండేళ్లపాటు బ్లాక్‌ చేస్తుంది.