దేశీయ విమాన సర్వీసుల సామర్థ్యం 65 శాతంకు పెంపు

దేశీయ విమానాల సామర్థ్యాన్ని కేంద్రం పెంచింది. ప్రస్తుతం ఉన్న 50 శాతం నడుస్తుండగా.. అదనంగా మరో 15 శాతం సర్వీసులను పెంచింది. మహమ్మారి సమయంలో విమానయాన మంత్రిత్వశాఖ దేశీయ చార్జీలు, సామర్థ్యం రెండింటినీ నియంత్రిస్తోంది. కరోనా పరిస్థితికి అనుగుణంగా రెండింటినీ సర్దుబాటు చేసింది. 

ప్రస్తుతం కొవిడ్‌ రెండో దశలో రోజువారీ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇంతకు ముందు కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడంతో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో దేశీయ సర్వీసుల సామర్థ్యాన్ని 80 శాతం నుంచి 50 శాతానికి తగ్గించింది. 

తాజాగా 65 శాతానికి పెంచిన పరిమితి జూలై 31 వరకు లేదా తదుపరి ఆదేశాల వరకు ఏది ముందైతే అది వర్తిస్తుందని మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి ఎస్‌కే మిశ్రా జారీ చేసిన ఉత్తర్వుల్లో విమానయానశాఖ పేర్కొంది. మంత్రిత్వ శాఖ గత వారం సామర్థ్యం పెంపుపై మినాశ్రయాల నిర్వాహకులు, సంస్థల నుంచి అభిప్రాయాలను కోరింది. 

ఆర్థికంగా క్లిష్ట స్థితిలో ఉన్న చాలా మంది వాటాదారులు ఎక్కువ దేశీయ విమానాలు నడిపేందుకు అనుమతించాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వం సామర్థ్యాన్ని 65 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో విమానయాన సంస్థలకు ఊరట కలుగనుంది.