పీవీ శతజయంతిపై కేసీఆర్ మాటలే, చేతలు సూన్యం 

`తెలంగాణ ముద్దు బిడ్డ’, మాజీ భారత ప్రధాని పివి శతజయంతి ఉత్సవాలను సంవత్సరం అంతా ఎంతో ఘనంగా జరుపుతామని గత ఏడాది ప్రకటించిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆయన విగ్రహం ఒకటి ఆవిష్కరించి ఉత్సవాలను సోమవారం ముగించారు. గత ఏడాది ఆయన మాటలు కోతలు దాటాయి గాని, అవేమి అమలు కాలేదు. 
 
రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సంబరాలు నిర్వహిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారు. వాటిని  అమలు చేసేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ తరువాత ఒకట్రెండు సార్లు ఉత్సవ నిర్వహణ కమిటీతో సమావేశాలు పెట్టి హడావుడి చేశారు. హామీలలో ఒకటి రెండు అమలు జరిపి చేతులు దులుపుకున్నారు.
 
గత ఏడాది ఆగస్ట్​ 28న ప్రగతి భవన్​ లో జరిగిన పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీలు ఈ విధంగా ఉన్నాయి:
 
‘నెక్లెస్​ రోడ్​కు పీవీ జ్ఞాన మార్గ్​గా పేరు పెడ్తాం. హైదరాబాద్​లో అంతర్జాతీయ స్థాయిలో పీవీ మెమోరియల్​ నిర్మిస్తాం. పీవీ పుట్టిన లక్నెపల్లి, పెరిగిన వంగర గ్రామాలను టూరిజం స్పాట్లుగా డెవలప్​ చేస్తాం. పీవీతో మంచి సంబంధాలు ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్​ క్లింటన్​, బ్రిటన్​ మాజీ అధ్యక్షులు జాన్​ మేజర్​, కామెరూన్​లను శత జయంతి ఉత్సవాలకు ఆహ్వానిస్తాం’ అని ఆ నాడు ప్రకటించారు. 
 
అసెంబ్లీలో పీవీ పొట్రె యిట్​ పెడతాం. పార్లమెంట్​లో కూడా పెట్టాలని కేంద్రాన్ని కోరుతాం. హైదరా బాద్​లో పీవీ నెలకొల్పిన సెంట్రల్​ యూని వర్సిటీకి ఆయన పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తాం. వంగర, వరంగల్​, కరీంనగర్​, హైదరాబాద్​, ఢిల్లీలో పీవీ విగ్రహాలు పెడతాం.’
 
సీఎం ఆదేశాలు, కమిటీ సిఫార్సుతో హైదరాబాద్​ నెక్లెస్​ రోడ్డు పేరును పీవీ జ్ఞానమార్గ్​ గా మార్చి, అక్కడ పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.  పీవీ రచనలు, ఆయన జీవిత విశేషాలతో  9 పుస్తకాలు పబ్లిష్ చేశారు. ఇవి తప్ప సీఎం ఇచ్చిన మిగతా హామీలన్నీ నెరవేరలేదు.
 
ప్రస్తుత వరంగల్​ రూరల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో పీవీ నరసింహరావు పుట్టారు. పెరిగిందంతా వరంగల్​ అర్బన్​ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర లోనే. అయితే ఈ రెండు గ్రామాలు పీవీ మరణం తరువాత పెద్దగా అభివృద్ధి​ కాలేదు. దీంతో ఆ రెండు గ్రామాలను టూరిజం స్పాట్లుగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చారు. 
 
రూ.7 కోట్లతో ఆ  గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. సీఎం ఆదేశాల మేరకు గత ఏడాది సెప్టెంబర్​ లో రాష్ట్ర పర్యాటక మంత్రి శ్రీనివాస్​ గౌడ్, స్థానిక మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతిరాథోడ్​ తదితరులు లక్నేపల్లి, వంగర గ్రామాలను సందర్శించి  టూరిజం సర్క్యూట్ చేస్తామంటూ హడావుడి చేశారే తప్ప జరిగిందేమీ లేదు. 
 
లక్నేపల్లిలో పీవీ స్మృతివనం, మ్యూజియం ఏర్పాటుకోసం పది ఎకరాల స్థలం భూసేకరణ దశలోనే ఉండిపోయింది.  ఇక చుట్టుపక్కల గ్రామాల నుంచి వంగరకు వెళ్లే రోడ్లు, ఇంటర్నల్ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. గ్రామంలో డ్రైనేజీ సిస్టం కూడా సరిగా లేదు.  పీవీ వాడిన వస్తువులతో ఆయన కుమారులు వంగరలో ఇదివరకే మ్యూజియం ఏర్పాటు చేయగా.. దాన్ని అభివృద్ధి​ చేసే ప్రయత్నం  జరగలేదు. 
రాష్ట్ర అసెంబ్లీలో, పార్లమెంట్​లో పీవీ చిత్ర పాఠాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని గతేడాది సెప్టెంబర్​ 8న అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా  తీర్మానం చేశారు. కానీ అవింకా అమలు కాలేదు.
పీవీతో  సంబంధం ఉన్న జిల్లాల్లో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు వంగర, వరంగల్​, కరీంనగర్​, హైదరాబాద్​, ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో పీవీ విగ్రహాలు పెట్టాలని, వెంటనే తయారీ కోసం ఆర్డర్​ ఇవ్వాలని ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులను సీఎం ఆదేశించారు. అవి కూడా మాటలకే పరిమితమయ్యాయి.
దీంతో హన్మకొండలో ఏకశిలా ఎడ్యుకేషన్​ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహం వద్దే పీవీ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక వంగరలో దాదాపు 15 ఏండ్ల కిందట పీవీ కుమారులు ఏర్పాటు చేసుకున్న విగ్రహం వద్దే పొలిటికల్​ లీడర్లు, పీవీ అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు.
హన్మకొండలోని కేయూ ఎస్డీఎల్​సీఈ నుంచి ఫాతిమా నగర్​ వరకున్న రోడ్డును పీవీ మార్గ్​ గా మారుస్తామని గ్రేటర్​ వరంగల్​ కౌన్సిల్​ మీటింగుల్లో ఇదివరకే టీఆర్ఎస్​ నేతలు తీర్మానించారు. కానీ ఆ ప్రక్రియ ఇంతవరకు ముందుకు సాగలేదు. కేయూలో పీవీ రీసెర్చ్​ సెంటర్​ ఏర్పాటు చేస్తామని ఏడాది కిందటే చెప్పిన సీఎం తాజాగా అదే హామీని ప్రకటించారు.