వ్యాక్సిన్‌పై నిర్ల‌క్ష్యం చాలా ప్ర‌మాదం

కరోనా వ్యాక్సిన్‌పై నెలకొన్న అనుమానాలు, భయాందోళనలను వీడాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మంలో భాగంగా జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాని మోదీ  ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచించారు. తాను మాత్ర‌మేగాక 100 ఏళ్ల వయసున్న తన త‌ల్లి సైతం రెండు డోసుల టీకా తీసుకున్నద‌ని ప్ర‌ధాని వెల్లడించారు.

‘మీ అకందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. శాస్త్ర విజ్ఞానాన్ని నమ్మండి. శాస్త్రవేత్తలను విశ్వసించండి. ఇప్పటికే అనేక మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. నేను రెండు డోసులు వేయించుకున్నా. 100 ఏళ్ల వయసున్న మా అమ్మ కూడా రెండు డోసుల టీకా తీసుకున్నారు. టీకాలపై వస్తున్న వదంతులను నమ్మవ‌ద్దు’ అని మన్‌ కీ బాత్‌ సందర్భంగా దేశ ప్రజలను మోదీ కోరారు.

కేవలం వ్యాక్సిన్‌ ద్వారా మాత్రమే మహమ్మారి నుంచి తప్పించుకోగలమని స్పష్టం చేస్తూ వదంతులు వ్యాప్తి చేసే వారిని పట్టించుకోవద్దని చెప్పారు. మన చుట్టూ ఉన్న ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకునేలా ప్రోత్సాహించాలని పిలుపునిచ్చారు. మహమ్మారి ముప్పు ఇంకా పొంచి ఉన్న నేపథ్యంలో వ్యాక్సిన్‌తో పాటు కరోనా కట్టడి నిబంధనల‌ను పాటించాలని కోరారు.

వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగంగా జరుగుతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఒక్క రోజులో 86 లక్షలు కన్నా ఎక్కువ మందికి టీకాలు వేసి భారత దేశం చరిత్ర సృష్టించిందని తెలిపారు. కరోనా వైరస్‌పై దేశ ప్రజల పోరాటం కొనసాగుతోందని మోదీ చెప్పారు. ఈ పోరాటంలో మనమంతా ఓ అసాధారణ విజయాన్ని సాధించామని పేర్కొన్నారు.

కొద్ది రోజుల క్రితం మునుపెన్నడూ లేని అద్భుతాన్ని మన దేశం సాధించిందని చెబుతూ జూన్ 21న 86 లక్షల మందికి పైగా ఉచిత వ్యాక్సిన్ తీసుకున్నారని.. ఒక రోజులో ఇంత ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకోవడం గొప్ప రికార్డు అని పేర్కొన్నారు. మధ్య ప్రదేశ్‌లోని బేటుల్ జిల్లా, దులేరియా గ్రామస్థులతో మోదీ మాట్లాడారు.

వ్యాక్సిన్‌పై సందిగ్ధతను తమ గ్రామంలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారని గ్రామస్థులు ఆయనకు తెలిపారు. దీనిపై స్పందించిన మోదీ మాట్లాడుతూ, వదంతులను నమ్మవద్దని వారికి నచ్చజెప్పారు.

మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్‌పై మోదీ మన్‌ కీ బాత్‌లో ప్రస్తావిస్తూ రోడ్ టు టోక్యో క్విజ్‌లో పాల్గొనడం ద్వారా విలువైన బహుమతులు గెలుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఫ్లయింగ్‌ సిఖ్‌గా పేరుపొందిన మిల్కా సింగ్‌ను మోదీ గుర్తు చేసుకున్నారు.

1964లో దేశం తరపున ఒలింపిక్స్‌లో పాల్గొన్న మిల్కా తృటిలో పతకాన్ని చేజార్చుకున్నాడని.. ఆ స్థాయి ప్రదర్శనతోనే దేశ మన్ననలు పొందాడని తెలిపారు. కరోనా కారణంగా ఒక లెజెండరీ అథ్లెట్‌ను కోల్పోవడం బాధాకరమని మోదీ అభిప్రాయపడ్డారు.