మావోయిస్టు అగ్రనేతలను బలితీసుకుంటున్న కరోనా 

దండకారణ్యంలో మావోయిస్టులకు కరోనా సోకిందని, పెద్దసంఖ్యలో చనిపోతున్నారని చెబుతూ వచ్చిన పోలీసుల మాటలే నిజమవుతున్నాయి.  పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ కొవిడ్‌ బారిన పడి ఈ నెల 21న మృతి చెందారు. దండకారణ్యంలోని మాడ్‌ డివిజన్‌ ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సిద్దబోయిన సారక్క ఈ నెల 22న చనిపోయారు.

ఈ ఘటనలను ధ్రువీకరిస్తూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ పేరిట  ప్రకటన కూడా విడుదలైంది. కరోనా తమ నేతలను కాటేస్తున్నట్లు మావోయిస్టులు అంగీకరించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.  ఈ లెక్కన కరోనా రూపంలో మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ తగిలినట్లైంది.
ఏప్రిల్​ చివరి వారంలో చత్తీస్​గఢ్ ​రాష్ట్రంలోని బీజాపూర్, -సుక్మా జిల్లాల సరిహద్దుల్లో 500 మంది మావోయిస్టులతో మీటింగ్​జరిగిందని, ఈ సమయంలో సుమారు 50 మంది సాయుధ నక్సల్స్ కు కొవిడ్​ సోకిందని ఇటీవల పోలీసులు వెల్లడించారు. 10‌‌‌‌‌‌‌‌ మంది మావోయిస్టులు చనిపోయినట్లు మే 10న దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్  ప్రకటించారు.
కొవిడ్​ సోకిన మావోయిస్టులు లొంగిపోతే రివార్డుతో పాటు ట్రీట్​మెంట్​అందిస్తామని బస్తర్ ఐజీ సుందర్​రాజ్​తో పాటు భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్​దత్​ మావోయిస్టులకు పిలుపునిచ్చారు. నాడు మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్​ ఇదంతా దుష్ప్రచారమని, ఎవరూ కరోనా బారినపడలేదని కొట్టిపారేశారు.
కానీ ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలను బట్టి పెద్దసంఖ్యలో మావోయిస్టులకు కరోనా సోకినట్లు స్పష్టమవుతోంది. కరోనా సోకి చికిత్స కోసం వచ్చిన దండకారణ్యం డివిజన్​ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్​ఈ నెల 1న  హన్మకొండ ములుగు క్రాస్​రోడ్డు వద్ద పోలీసులకు చిక్కాడు. అప్పటికే కొవిడ్​తో పరిస్థితి సీరియస్​ కావడంతో హైదరాబాద్​లోని ఉస్మానియాకు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.
ఆ తర్వాత  కేంద్ర కమిటీ సభ్యుడు కత్తి మోహన్​రావు అలియాస్​ ప్రకాశన్న కూడా కరోనాతో కన్నుమూశాడు. ఈ విషాదం నుంచి మావోయిస్టులు తేరుకోకముందే తాజాగా ఈ నెల 21న తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్​, 22న ఇంద్రావతి కమిటీ సభ్యురాలు సిద్దబోయిన సారక్క అలియాస్‍ భారతక్క  చనిపోయారు.  బ్రాంకైటిస్‍, అస్తమాకు కరోనా తోడై ఈ నెల 21న ఉదయం 9 గంటలకు హరిభూషణ్​ చనిపోయారని  వారే ధృవీకరించారు.
22న చనిపోయిన సారక్క, 12 రోజుల క్రితం చనిపోయిన కత్తిమోహన్​రావు భార్య. 29 ఏండ్ల వీరి వైవాహిక జీవితానికి 12 రోజలు వ్యవధిలో తెరపడినట్లయింది. ఇద్దరు మావోయిస్టుల మృతితో ఇటు మహబూబాబాద్​ జిల్లా గంగారం మండలంలోని హరిభూషణ్​ స్వగ్రామం మడగూడెంలో,  అటు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని సారక్క స్వగ్రామం కాల్వపల్లి లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆరోగ్యం అదుపు తప్పితే గాని కరోనా సోకినా వారికి తగు వైద్యం కోసం బైటకు వెళ్ళడానికి పార్టీ అనుమతించడం లేదని తెలుస్తున్నది. అటవీ ప్రాంతాలలో తగిన వైద్య సదుపాయాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వీరికి ప్రధానంగా ఇన్ఫోర్మర్ల  ద్వారా ఈ వైరస్ సోకుతున్నట్లు భావిస్తున్నారు. దానితో మావోయిస్టు లలో ఆందోళన నెలకొంటుంది. కరోనా టీకాల కోసం వారు విఫల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
నగరాలు, పట్టణాలు, గ్రామాలలో కరోనా మహమ్మారి ఉధృతంగా వ్యాపించగా, మారుమూల అటవీ ప్రాంతాలకు కూడా చేరడం మావోయిస్టులను కలవర పరుస్తున్నది. సాధారణ పౌరులవలె గ్రామాలకు వెళ్లి టీకాలు, మందులు పొందే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందుతున్నది. దానితో వారు కూడా గాలింపు చర్యలను ముమ్మరం చేస్తున్నారు.