4.8 లక్షల కరోనా మరణాలను దాచిపెట్టిన ఐదు రాష్ట్రాలు   

దేశంలోని ఐదు రాష్ట్రాలు కరోనా మరణాలను దాచిపెట్టాయి. ఈ జాబితాలో ఏపీ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీల్లోనే దాదాపు 4.8 లక్షల మరణాలను లెక్కలోకి తీసుకోలేదని తెలుస్తోంది.

గత ఐదు నెలల్లోనే 75 వేల మరణాలను బీహార్ దాచిందని ప్రభుత్వ గణాంకాల ద్వారా శనివారమే తెలిసింది. మరోవైపు మహారాష్ట్ర కూడా కరోనా మరణాల లెక్కలను సవరిస్తోంది. దీంతో గత 12 రోజుల్లోనే 8,800 మరణాలను మహారాష్ట్ర ప్రభుత్వం లెక్కల్లో చేర్చింది. ఈ నేపథ్యంలో కరోనా మరణాలు ఎక్కడ నమోదైనా వాటిని కరోనా మరణాలుగానే పరిగణించాల్సిందేనని, వాటినీ లెక్కలోకి తీసుకోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.

ఆరు రాష్ట్రాల్లో కరోనా మరణాల లెక్కల్లో తేడాలున్నాయన్న మీడియా కథనాల నేపథ్యంలో సుప్రీంకోర్టులో కేంద్రం 183 పేజీల అఫిడవిట్ ను దాఖలు చేసింది. ఈ నిబంధనను ఎవరు అతిక్రమించినా ఆ వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇప్పటిదాకా కేవలం ఆసుపత్రుల్లో మరణించిన వారినే లెక్కలోకి తీసుకుంటున్నారని, ఇల్లు లేదా ఆసుపత్రి పార్కింగ్ ప్రదేశాల్లో చనిపోతున్న వారిని కరోనా మరణాల కింద పరిగణించట్లేదని పేర్కొంది.

‘‘చాలా డెత్ సర్టిఫికెట్లలో ఊపిరితిత్తుల సమస్య లేదా గుండె జబ్బు సమస్యతో చనిపోయారని పేర్కొంటున్నారు. కరోనా బాధితులు చనిపోతే వారికి డెత్ సర్టిఫికెట్లు జారీ చేసే విషయంలో సరైన విధానాలంటూ లేవా? దానికి ఏవైనా మార్గదర్శకాలున్నాయా’’ అంటూ కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులిచ్చింది. దీనిపైనే కేంద్రం అఫిడవిట్ ను దాఖలు చేసింది.

మరో వంక, కరోనాతో చనిపోయిన వారందరికీ పరిహారం చెల్లించలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అలా చేస్తే విపత్తు ఉపశమన నిధులూ సరిపోవని పేర్కొంది. కొవిడ్ కల్లోల ఉపశమనానికి కనీస ప్రమాణాలు పాటించాలని, కరోనాతో మరణించిన వారికి పరిహారం చెల్లించాలని పేర్కొంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారించింది. దీనిపై ప్రభుత్వ వివరణ కోరగా.. అఫిడవిట్ ను దాఖలు చేసింది.

‘కరోనాతో చనిపోయినవారికి రూ.4 లక్షల పరిహారాన్ని చెల్లించలేం. భూకంపాలు, వరదలు ఇతర ప్రకృతి విపత్తుల వల్ల నష్టం సంభవిస్తేనే పరిహారం చెల్లించాలని విపత్తు నిర్వహణ చట్టంలో స్పష్టంగా ఉంది’ అని పేర్కొంది. కరోనాతో మరణించిన ప్రతి ఒక్కరికీ రూ.4 లక్షల చొప్పున ఇస్తూ పోతే విపత్తు నిధులు మొత్తం దీనికే పోతాయని, అవీ చాలవని తెలిపింది.

రాష్ట్ర విపత్తు ఉపశమన నిధులను మొత్తం దానికే ఖర్చు చేస్తే  రాష్ట్రాల్లో కొవిడ్ నియంత్రణ ఏర్పాట్లకు నిధులుండవని చెప్పింది. అంతేగాకుండా తుఫాన్లు, వరదల వంటివి వచ్చినప్పుడు వాటి కోసమూ నిధులు కావాల్సి ఉంటుందని కోర్టుకు చెప్పింది. కాబట్టి.. కరోనాతో మరణించిన ప్రతి ఒక్కరికీ పరిహారం ఇవ్వాలంటే.. రాష్ట్రాల ఖజానాకు మించిన భారం అవుతుందని పేర్కొంది.

బాధితుల బీమా చెల్లింపులకు సంబంధించి జిల్లా కలెక్టర్లు దరఖాస్తులను ఇన్సూరెన్స్ సంస్థలకు పంపించారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే బీమా సంస్థలకు రూ.442.4 కోట్ల నిధులను విడుదల చేశామంది.

2019–2020లోనే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.1,113.2 కోట్ల అదనపు నిధులను విడుదల చేశామని వివరించింది. మొత్తంగా నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్ఎం) ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్స్ ప్రిపేర్డ్ నెస్ ప్యాకేజ్ కింద ఇప్పటిదాకా రూ.8,257.89 కోట్ల నిధులను ఇచ్చామని కేంద్రం వెల్లడించింది.