తెలంగాణాలో లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేత 

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. శనివారం మ‌ధ్యాహ్నం స‌మావేశ‌మైన రాష్ట్ర కేబినెట్ ఈ మేర‌కు నిర్ణ‌యించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్ ఈ మేరకు లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నది.

లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను మంత్రివ‌ర్గం ఆదేశించింది. దేశవ్యాప్తంగానే కాకుండా, పొరుగు రాష్ట్రాల్లో కూడా కరోనా నియంత్రణలోకి వస్తున్న విషయాన్ని కేబినెట్ పరిశీలించింది.

తెలంగాణలో ఇతర రాష్ట్రాలకంటే వేగంగా కరోనా నియంత్రణలోకి వ‌చ్చింద‌ని అధికారులు అందించిన నివేదికల ఆధారంగా కేబినెట్ నిర్దారించింది. ఈ మేరకు జూన్ 19 వరకు అమల్లో ఉన్న లాక్ డౌన్‌ను రేపటి నుంచి (జూన్ 20) సంపూర్ణంగా ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది.

కాగా, క‌రోనా తీవ్ర‌త‌ త‌గ్గుముఖం, లాక్‌డౌన్ ఎత్తివేత‌తో అన్ని కేటగిరీల విద్యా సంస్థలను పూర్తిస్థాయి సన్నద్థతతో జూలై 1 నుంచి ప్రారంభించాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. రాష్ట్ర మంత్రివ‌ర్గం ఈ మేర‌కు విద్యాశాఖ‌ను ఆదేశించింది. ప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశంతో ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని కేబినెట్ కోరింది. లాక్ డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని ప్రజలను హెచ్చరించింది. 

తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం.. తదితర కరోనా స్వీయ నియంత్రణ విధానాలను విధిగా పాటించాలని స్పష్టం చేసింది. అందుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలని కేబినెట్ కోరింది. కరోనా పూర్తిస్థాయి నియంత్రణకు ప్రజలు త‌మ‌ సంపూర్ణ సహకారం అందించాలని కేబినెట్ కోరింది.

కరోనా కేసులు విజృంభించడంతో తొలుత మే 14 నుంచి 20 వరకు లాక్‌డౌన్ ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నాలుగు గంటల పాటు లాక్‌డౌన్ సడలింపు ఇవ్వగా… ఆ తర్వాత మే 21 నుంచి 31 వరకు మరోసారి లాక్‌డౌన్ పొడిగించారు. అయితే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. 

అయితే జూన్‌లో మరోసారి లాక్‌డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి 10 వరకు లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం మరో పదిరోజుల పాటు లాక్‌డౌన్ పొడిగించారు. 

ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్ డౌన్ సడలించాలని, సాయంత్రం 5 గంటలనుంచి 6 గంటల వరకు అంటే గంటపాటు తిరిగి ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులు బాటు కల్పించాలని నిర్ణయించింది. అయితే తాజా కేబినెట్ సమావేశంలో పూర్తిగా ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నారు.