ఇక క్రెడిట్‌ కార్డుల తోనూ ఐటి చెల్లింపులు 

ఆదాయం ప‌న్ను (ఐటీ) చెల్లింపులు సుల‌భ‌తరం చేసేందుకు ఆదాయం ప‌న్నుశాఖ స‌రికొత్త ఫీచ‌ర్లు అందుబాటులోకి తెస్తున్న‌ది. ఇంత‌కుముందు ఉన్న పాత సైట్‌లో ప్రతికూలతలను తొలగిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల కొత్త ఐటీ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చిన సంగ‌తి తెలిసిందే.
 
పన్ను చెల్లింపుదారుల‌ సౌకర్యార్థం త్వ‌ర‌లో ఈ వెబ్‌సైట్‌లో మరిన్ని ఫీచర్లను జతచేయాలని ప్రభుత్వం యోచిస్తున్న‌దని సమాచారం. పన్నులు, ఫీజులు, జరిమానాల వసూలు సహా రీఫండ్ల వంటి సేవలను అందించేందుకు ప్రైవేటు బ్యాంకులకు కూడా అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తున్న‌ది.
ఈ నేపథ్యంలో క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు, యూపీఐ వంటి కొత్త చెల్లింపు వేదిక‌లను సైట్‌కి జత చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తున్నది.  మరో వారం రోజుల్లో ఈ కొత్త వెసులుబాట్లు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. 

ఈ మేరకు త్వరలో కొత్త సైట్‌లో ఐటీ చెల్లింపుల‌కు ఆయా బ్యాంకులను చేర్చనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆయా బ్యాంకులు అనుమతి కోసం దరఖాస్తు చేసుకునేందుకు త్వరలో ప్రభుత్వం అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తున్న‌ది.

ఇప్పటి వరకు నెట్‌ బ్యాంకింగ్‌, డెబిట్‌ కార్డు ద్వారా మాత్రమే చెల్లింపులు చేసే అవకాశం ఖాతాదారులకు ఉంది. మెజారిటీ ప్రైవేట్‌ బ్యాంకులకు పోర్టల్‌లో చోటు లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి