నిధులు కేంద్రానివి.. కాలనీల పేర్లు `వైఎస్సార్‌ జగనన్న’ 

నిధులు కేంద్రానివి.. కాలనీల పేర్లు `వైఎస్సార్‌ జగనన్న’ 

రాష్ట్రంలో పేదలకోసం రూ 50,000 కోట్ల వ్యయంతో 28 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నట్లు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కొంతకాలంగా భారీ ప్రచారం చేసుకొంటున్నది. అయితే పక్కా ఇళ్లకు ఇచ్చే రాయితీలో సింహాభాగం కేంద్ర పథకాల ద్వారానే పేదలకు అందనున్నాయి. ఈ మొత్తంలో నాల్గవ వంతు కూడా రాష్ట్ర ప్రభుత్వం  భరించడం లేదు.

‘గోరంత’! ప్రచారం మాత్రం ‘కొండంత’ అన్న చందాన దాదాపు కేంద్ర నిధులతో ఈ గృహాలను నిర్మిస్తూ, వాటికి వైసిపి రంగు వేసుకొంటున్నట్లు కనిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం రూ.28 లక్షల పైచిలుకు ఇళ్లకు గురువారం రెండోసారి శంకుస్థాపన చేసింది. ఇందులో తొలిదశలో 17.60లక్షల ఇళ్లు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడించారు. ఈ ఇళ్లన్నీ ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనతో అనుసంధానం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఈ కాలనీలకు వైఎస్సార్‌ జగనన్న కాలనీలు అని నామకరణం చేస్తున్నారు. అన్ని గృహాలకు వైసిపి రంగులు వేయనున్నారు. పీఎంఏవైలో పూర్తిస్థాయి గ్రామీణ ప్రాంతాలు మినహా నిర్మించే ఇళ్లన్నింటికీ,కేంద్రం రూ.1.50 లక్షల చొప్పున రాయితీ ఇస్తోంది. నగరాలు, పట్టణాలతో పాటు యూడీఏల పరిధిలో నిర్మించే ఇళ్లన్నింటికీ ఈ రాయితీ వర్తిస్తుంది.

కేంద్రప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రానికి పీఎంఏవై (గ్రామీణ్‌), పీఎంఏవై(అర్బన్‌) పథకాల కింద సుమారు రూ.18 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. అందులో అతి కొద్ది సంఖ్య తప్ప దాదాపు ఇళ్లన్నీ పీఎంఏవై అర్బన్‌ పరిధిలోనే ఉన్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం తొలిదశ కింద చేపట్టిన 15.60 లక్షల ఇళ్లన్నీ అర్బన్‌ పరిధిలోకే వస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి ఇచ్చే రాయితీని రూ.1.80 లక్షలుగా నిర్ణయించింది. అందులో రూ.1.50 లక్ష కేంద్రం రాయితీ పోతే రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.30 వేలు మాత్రమే భరిస్తోంది. అందులోనూ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని ఇళ్లకు మాత్రమే ఆ రూ.30 వేలయినా రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించాల్సి వస్తోంది.

మిగిలిన యూడీఏల్లోని ఇళ్లకు ఉపాధి హామీ నిధులను రాయితీ కింద అనుసంధానిస్తారు. అంటే యూడీఏల్లో నిర్మించే ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వదు. రెండు దశల్లో చేపట్టబోయే 28లక్షల ఇళ్లల్లో పూర్తిగా పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లు ఐదు లక్షలకు మించి ఉండే అవకాశం లేదు. కేవలం ఆ 5 లక్షల ఇళ్లకు ఒక్కో ఇంటికి రూ.30 వేలు చొప్పున అంటే మొత్తం కలిపినా రూ.1500 కోట్లు మించి రాష్ట్ర ప్రభుత్వానికి భారం పడే అవకాశం లేదు. మిగిలిన నిధులన్నీ అటు రాయితీల రూపంలోగానీ, ఇటు ఉపాధి నిధుల అనుసంధాన రూపంలో గానీ కేంద్రం నుంచే వచ్చేవే.

అయినా ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నట్లే ప్రచారం చేసుకొంటున్నారు.  ప్రభుత్వం తాను నిర్దేశించుకున్న 28 లక్షల ఇళ్లను నిర్మించాలంటే 10 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తిగా సొంత నిధులతో నిర్మించాల్సి ఉంటుంది. కానీ వాటిని కూడా కేంద్రం మంజూరు చేసిన ఇళ్ల కిందే చేపట్టాలని ప్రభుత్వ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి.

ఎలాగూ తొలిదశ ఇళ్లకు మరో ఏడాది గడవు ఉంది. ఆ తర్వాత అయినా మిగతా ఇళ్లను కూడా కేంద్రం మంజూరు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. అంతే తప్ప సొంతంగా నిధులు వెచ్చించి ఇళ్లు నిర్మించాలనే ఆలోచన వైసీపీ ప్రభుత్వంలో  ఏ మాత్రం కనిపించడం లేదు.