కార్పోరేట్ ఆస్పత్రులు దోచుకొంటున్నా కేసీఆర్ పట్టించుకోరే!

తెలంగాణాలో కార్పొరేట్ ఆసుపత్రులు కరోనా రోగులను దోచుకొంటున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోరే అంటూ బిజెపి నేత, మాజీ ఎంపీ విజయశాంతి ప్రశ్నించారు. కరోనా దెబ్బకు తెలంగాణలోని కార్పోరేట్ ఆస్పత్రుల బారిన పడి ఎన్నో కుటుంబాలు ఆస్తులమ్ముకుని రోడ్డున్న పడ్డాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ప్రస్తుత సెకండ్ వేవ్‌తో పాటు గతేడాది మొదటి వేవ్‌లోనూ ఇదే పరిస్థితి ఏర్పడిందని ఆమె గుర్తు చేశారు.  కోర్టులు కూడా ఆసుపత్రుల తీరుపై మండిపడుతున్నా, సర్కారుకు మాత్రం పట్టడం లేదని ధ్వజమెత్తారు.
‘కరోనా దెబ్బకు తెలంగాణలోని కార్పోరేట్ ఆస్పత్రుల బారిన పడి ఆస్తులమ్ముకుని ఎన్ని కుటుంబాలు  రోడ్డున పడ్డాయో లెక్కలేదు. నేటి సెకెండ్ వేవ్ సమయంలో మాత్రమే కాదు… గతేడాది ఫస్ట్ వేవ్ సమయంలో కూడా కార్పోరేట్ ఆస్పత్రుల ట్రీట్‌మెంట్ ఛార్జీల దెబ్బకు ఎన్నో కుటుంబాలు కుదేలయ్యాయి. తెల్ల కాగితాలపైనే బిల్లులంటూ రాసిచ్చి, హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా పట్టించుకోకుండా  అరాచకం సృష్టించాయి’ అంటూ ట్విట్టర్ లో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు .
 
ప్రయివేట్, కార్పోరేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు చికిత్స జరగలేదన్నది పచ్చి నిజం అని ఆమె స్పష్టం చేశారు . ఇదంతా పాలకులకు తెలిసే జరిగిందనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదని చెప్పారు. కరోనా కట్టడిలో వైఫల్యాలపై గతంలోనే న్యాయస్థానం ఎండగట్టినప్పటికీ ఈ సర్కారు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. 
 
ఈ సారి మాత్రం ఈ పరిస్థితులను చక్కదిద్దాల్సిందేనని,  కరోనా చికిత్స పేరిట అక్రమంగా రోగుల కుటుంబాల నుంచి కార్పోరేట్ ఆస్పత్రులు గుంజిన అధిక ఛార్జీలను తిరిగి వసూలు చేసి బాధితులకు ఇప్పించాల్సిందేనని హైకోర్టు కఠినంగా సర్కారును అదేశించిందని ఆమె గుర్తు చేశారు.  
 
తప్పు చేశాయంటూ సర్కారు గుర్తించిన ఆస్పత్రులకు కేవలం కోవిడ్ చికిత్స అనుమతి మాత్రమే రద్దు చేశారు. మరి బాధితుల నుంచి ఆ ఆస్పత్రులు దోపిడీ చేసిన డబ్బు మాటేమిటి? ఆ తప్పు చేసిన ఆస్పత్రులకు శిక్ష వెయ్యరా?  అంటూ ప్రశ్నించారు. ఈ పాలకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు ఆదేశించిన ప్రకారం దోపిడీకి పాల్పడిన ఆస్పత్రుల నుంచి అక్రమార్జన కక్కించి బాధితులకు న్యాయం చెయ్యాల’ని విజయశాంతి డిమాండ్ చేశారు.