బీహార్ లో బాలికలకు 33 శాతం మెడిసిన్‌, ఇంజినీరింగ్‌ సీట్లు 

బిహార్‌లోని బాలికలకు మెడిక‌ల్‌, ఇంజినీరింగ్ కాలేజీల్లో అమ్మాయిల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిర్ణ‌యంచారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మావేశం నిర్వ‌హించిన అత్యున్నత సమావేశంలో సీఎం నితీష్ బిహార్‌లో మెడికల్, ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయాల స్థాపనకు సంబంధించిన బిల్లులను కూడా  చర్చించారు.

ఈ సమావేశంలో ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయం, వైద్య విశ్వవిద్యాలయాల స్థాపనకు ప్రతిపాదిత బిల్లును ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమర్పించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి లోకేష్ కుమార్ సింగ్, ఆరోగ్య శాఖ అద‌న‌పు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్ర‌త‌య అమృత్‌.. ఇంజనీరింగ్, మెడికల్‌ విశ్వవిద్యాలయ చట్టాల గురించి వివ‌రించారు.

కొత్త‌గా రెండు విశ్వవిద్యాలయాల స్థాపనతో ఇంజినీరింగ్‌, వైద్య కళాశాలల నిర్వహణ మెరుగుపడటమే కాకుండా మంచి విద్య కూడా అందుబాటులోకి వ‌స్తుంద‌ని ముఖ్యమంత్రి ఆశాభావం వ్య‌క్తం చేశారు.

ఇది ఓ ప్రత్యేకమైన ప్రయత్నమని, ఉన్నత విద్యా సంస్థల్లో ఎక్కువ మంది అమ్మాయిలు చేరేలా అవకాశం కల్పించినట్లు అవుతుందని తెలిపారు. ఇలా రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఉన్నత విద్య వైపు అమ్మాయినలు ప్రోత్సహించినట్లు కూడా అవుతుందని సీఎం పేర్కొన్నారు.

 మెడికల్, ఇంజినీరింగ్ విద్యాభ్యాసం కోసం తమ రాష్ట్రానికి చెందిన అమ్మాయిలు, ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో కాలేజీలను స్థాపించాలన్న నిర్ణయానికి తాము కట్టుబడే ఉన్నామని నితీశ్ పునరుద్ఘాటించారు. జిల్లాకో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటయ్యేలా చూస్తామని నితీశ్ హామీ ఇచ్చారు.