ఏడేళ్ళలో మునుపెన్నడూ  లేని ఘన విజయాలు 

ఈ ఏడేళ్ళలో భారత దేశం మునుపెన్నడూ లేనటువంటి ఘన విజయాలను సాధించినట్లు  కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. దేశ భద్రత, ప్రజా సంక్షేమం, సంస్కరణల రంగాల్లో  మన దేశం విజయాలు నమోదు చేసుకూడని కొనియాడుతూ మోదీ పరిపాలన వార్షికోత్సవాల సందర్భంగా ట్వీట్లు ఇచ్చారు. 

భారత దేశాన్ని ఏడేళ్ళ నుంచి విజయవంతంగా పరిపాలిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం అభినందించారు.మోదీ తన శక్తిమంతమైన నాయకత్వ పటిమతో దేశాన్ని బలోపేతం చేశారని అమిత్ షా పేర్కొన్నారు.

రైతులు, అణగారిన వర్గాలు, పేదల జీవన ప్రమాణాలను పెంచారని, వారిని ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకొచ్చారని అభినందించారు. ఈ విజయాలను సాధించడంలో మోదీ దృఢనిశ్చయం, సంక్షేమ విధానాలు దోహదపడినట్లు తెలిపారు. 

అభివృద్ధి, భద్రత, ప్రజా సంక్షేమం, మైలురాళ్ళ వంటి సంస్కరణల మధ్య సాటిలేని సమన్వయానికి మోదీ ప్రభుత్వం ఉదాహరణగా నిలుస్తోందని చెప్పారు. మోదీ సేవల పట్ల, అంకితభావం పట్ల దేశ ప్రజలు ఏడేళ్ళ నుంచి నిరంతరం నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నారని, వారికి శిరసు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు.

ప్రతి సవాలును మోదీ దార్శనిక నాయకత్వంలో అధిగమించగలమని, భారత దేశ అభివృద్ధి ప్రయాణం నిరాటంకంగా కొనసాగుతుందని తనకు నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.