డొమినికా పోలీసుల అదుపులో  మెహుల్‌ చోక్సీ

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీని డొమినికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీఎన్‌బీ కుంభకోణం కేసులో మెహుల్‌ చోక్సీ భారత్‌ను వీడి ఆంటిగ్వా, బార్బుడాకి పారిపోయిన విషయం తెలిసిందే. అరెస్ట్ అయిన చోట నుండి వచ్చే 48 గంటలలో అతనిని భారత్ కు పంపిస్తామని ఆంటిగ్వా, బార్బుడా ప్రధాన మంత్రి గస్టోన్ బ్రౌనే వెల్లడించారు. 

రూ.13,500 కోట్ల కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అతన్ని దేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల అక్కడి నుంచి క్యూబాకు పరారయ్యేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మోహుల్‌ చోక్సీ అదృశ్యంపై ఇప్పటికే ఇంటర్​పోల్​ నోటీసులు జారీ చేసింది. కరేబియన్‌లోని చిన్న ద్వీప దేశమైన డొమినికాకు పడవ ద్వారా మెహుల్ చోక్సీ చేరుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. లుక్ అవుట్ నోటీసు జారీ అయిన అనంతరం  స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం వారి అదుపులో ఉన్నాడు.

ఆంటిగ్వా అధికారులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోందని, ఈ మేరకు సీబీఐ, ఈడీకి సమాచారం ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ .13,500 కోట్ల రుణ మోసానికి పాల్పడిన చోక్సీ చివరిసారిగా ఆదివారం తన కారులో ఆంటిగ్వా, బార్బుడాలో కనిపించారు.

ఆపై కారు దొరికినా అతను తప్పిపోయినట్లు సిబ్బంది వెల్లడించారు. 2018 పీఎన్‌బీ కుంభకోణం వెలుగులోకి రావడానికి ముందే మెహుల్‌ చోక్సీ, అతని మేనల్లుడు, ప్రముఖ ఆభరణాల వ్యాపారి అయిన నీరవ్‌ మోదీ భారత్‌ నుంచి పరారైన విషయం తెలిసిందే. మెహుల్‌ ఆంటిగ్వా పౌరసత్వం తీసుకోగా, నీరవ్‌ మోదీ లండన్‌కు పారిపోయాడు. అయితే, తనపై ఉన్న కేసులు రాజకీయ కుట్రల ఫలితమేనని, భారతదేశంలో అతని ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చట్టవిరుద్ధంగా అటాచ్ చేసిందని మెహుల్ చోక్సీ ఆరోపించారు.