సెప్టెంబర్ 19నుంచి దుబాయిలో ఐపిఎల్?

సెప్టెంబర్ లో ఐపిఎల్ 14వ సీజన్ తిరిగి ప్రారంభించాలని బిసిసిఐ కసరత్తులు చేస్తోంది. దుబాయిలో మిగతా మ్యాచులను నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది. భారత్ లో ప్రారంభమైన ఐపిఎల్ 14వ సీజన్ కరోనా విజృంభణతో మధ్యలోనే టోర్నీ నిలిచిపోయింది.
 
భారత్ లో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తున్నా ఐపిఎల్ నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. చివరికి పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో ఐపిఎల్ ను నిరవధికగా వాయిదా వేస్తున్నట్లు బిసిసిఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే 21 మ్యాచులు జరగ్గా.. ఇంకా 31 మ్యాచ్ లు నిర్వహించాల్సి ఉంది. 
 
ఈ నేపథ్యంలో మిగతా మ్యాచ్ లను సెప్టెంబర్ లో దుబాయి వేదికగా తిరిగి కొనసాగించాలని బిసిసిఐ ప్రణాళికలు రూపొందిస్తోంది. సెప్టెంబర్ 19న ప్రారంభించవచ్చని సంకేతాలు ఇస్తున్నది.  అన్ని అనుకున్నట్లు కుదిరితే అక్టోబర్ 10న దుబాయిలో ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగనుందని బిసిసిఐ అధికారి ఒకరు తెలిపారు. 
 
కాగా, ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 6 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక, 5 విజయాలతో చెన్నై, బెంగళూరు జట్లు రెండు మూడు స్థానాల్లో ఉండగా, 4 నాలుగు విజయాలు సాధించిన ముంబై జట్టు నాలుగో స్థానంలో, మూడు విజయాలతో రాజస్థాన్ ఐదో స్థానంలో ఉన్నాయి.