ఎంపీ రఘురామ హౌస్‌మోషన్ పిటిషన్ డిస్మిస్

ఎంపీ రఘురామకృష్ణం రాజు హైకోర్టులో దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. బెయిల్ కోసం సీఐడీ కోర్టులో ప్రయత్నించమని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.  రఘురామ అరెస్ట్‌ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
నేరుగా హైకోర్టును కాకుండా కింద కోర్టును సంప్రదించాలని హైకోర్టు సూచించింది. అనంతరం రఘురామ బెయిల్ దరఖాస్తుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కింద కోర్టును హైకోర్టు ఆదేశించింది. తీర్పుకాపీని కూడా వెంటనే ఇస్తామని హైకోర్టు తెలిపింది. 
 
మరోవైపు వెంటనే రిమాండ్‌కు పంపుతామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. రఘురామకృష్ణరాజు ఆరోగ్యంపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాత్రి నుంచి గుంటూర్‌సీఐడీ కార్యాలయంలోనే రఘురామకృష్ణరాజు ఉన్నారు. ఇవాళ ఉదయం ఆయనకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు.